మార్కెట్ల దూకుడు- మళ్లీ రికార్డ్స్‌ ర్యాలీ | Market open with new high records | Sakshi
Sakshi News home page

మార్కెట్ల దూకుడు- మళ్లీ రికార్డ్స్‌ ర్యాలీ

Dec 16 2020 9:59 AM | Updated on Dec 16 2020 11:27 AM

Market open with new high records - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. వెరసి మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 331 పాయింట్లు జంప్‌చేసి 46,594 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు బలపడి13,657 వద్ద కదులుతోంది. మంగళవారం యూఎస్‌ మార్కెట్లు ప్రధానంగా నాస్‌డాక్‌ రికార్డ్‌ గరిష్టం వద్ద నిలవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,599 వద్ద, నిఫ్టీ 13,666 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. (దుమ్మురేపిన బజాజ్‌ ఫైనాన్స్‌)

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌(0.5 శాతం) మాత్రమే డీలాపడగా.. మెటల్‌, రియల్టీ, ఆటో రంగాలు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా 3-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే టెక్‌ మహీంద్రా‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (మార్కెట్‌ డౌన్‌- ఈ షేర్లు జూమ్‌)

ఐబీ హౌసింగ్‌ జూమ్‌
డెరివేటివ్స్‌లో ఐబీ హౌసింగ్‌, వేదాంతా, అపోలో టైర్‌, సెయిల్‌, అశోక్‌ లేలాండ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎన్‌ఎండీసీ, హెచ్‌పీసీఎల్‌, యూబీఎల్‌ 5-1.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీఎన్‌బీ 6 శాతం పతనంకాగా.. జీఎంఆర్, టొరంట్‌ పవర్‌, కోఫోర్జ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా కెమ్‌, పిరమల్‌ 1.5-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,685 లాభపడగా.. 589 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల జోరు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement