Malabar Gold: 5 వేల ఉద్యోగాలు, సగం వారికే
మలాబార్ గోల్డ్,నియామకాల జోరు
5,000 మందిని చేర్చుకోనున్న కంపెనీ
సాక్షి,న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న కేరళ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ నియామకాలను చేపట్టనుంది. భారత్లో రిటైల్తోపాటు ఇతర విభాగాల కోసం 5,000 పైచిలుకు మందిని కొత్తగా చేర్చుకోనున్నట్టు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ మంగళవారం ప్రకటించారు. వీరిలో సగం మంది మహిళలు ఉంటారు.
అకౌంటింగ్, డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఆభరణాల తయారీ, సరఫరా నిర్వహణ, ఫైనాన్స్, ఐటీ వంటి విభాగాల్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జువెల్లరీ విక్రయాలు, కార్యకలాపాల కోసం బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లకు ఇంటర్న్షిప్స్, ట్రెయినీషిప్స్ సైతం ఆఫర్ చేయనుంది. కొత్తగా చేరినవారు సంస్థ కేంద్ర కార్యాలయం ఉన్న కేరళలోని కోజికోడ్తోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కత ఆఫీస్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఔత్సాహికులు కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10 దేశాల్లో 260 ఔట్లెట్లను సంస్థ నిర్వహిస్తోంది. వార్షిక టర్నోవర్ సుమారు రూ.33,640 కోట్లు.
మరిన్ని వార్తలు