
జూబిలెంట్ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ (జేఎఫ్ఎల్), జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశారు.
ఎన్ఎస్ఈలోని బ్లాక్ డీల్స్ డేటా ప్రకారం జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రమోటర్ అయిన జూబిలెంట్ కన్జూమర్ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్ ఇన్గ్రేవియా ప్రమోటింగ్ సంస్థలు (జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్ సుందర్ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.
అలాగే జూబిలెంట్ ఫార్మోవా ప్రమోటర్ సంస్థలు జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది.