రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట! | Interesting Facts About Hope Diamond Price and Details | Sakshi
Sakshi News home page

రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!

Jun 25 2024 7:39 PM | Updated on Jun 25 2024 9:01 PM

Interesting Facts About Hope Diamond Price and Details

బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.

నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.

గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూర్‌లోని కింబర్‌లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్‌లో దొరికినట్లు స్పష్టమవుతోంది.

17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్‌స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు విరాళంగా ఇచ్చేసారు.

ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు విరాళంగా ఇచ్చేసారు.

1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500.

Advertisement
 
Advertisement
Advertisement