బెంగళూరు - హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌... రైల్వే శాఖ కీలక నిర్ణయం

Indian Railways Proposed To Construct Bangalore Hyderabad Bullet Train Project - Sakshi

దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలో ఇప్పటికే ఎనిమిది కారిడార్లలో బుల్లెట్‌ రైళ్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కాగా భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ని పరిగణలోకి తీసుకుని మరో నాలుగు కారిడార్లలో బుల్లెట్‌ ట్రైన్‌ని పరుగులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది.

వాటి సరసన
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా విరాజిల్లుతున్నా బుల్లెట్‌ ట్రైన్ల పరంగా ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఆసియాలో బిగ్గెస్ట్‌ ఎకానమీలైన చైనా, జపాన్‌లలో ఇప్పటికే బుల్లెట్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో బుల్లెట్‌ ట్రైన్‌ కలిగిన దేశాల సరసన ఇండియాను నిలపపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

8 కారిడార్లలో
బుల్లెట్‌ ట్రైన్‌ కలను సాకారం చేసేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా 8 రూట్లలో బుల్లెట్‌ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో ముంబై - సూరత్‌ - వడోదర - అహ్మదాబాద్‌, ఢిల్లీ - నోయిడా - ఆగ్రా - కాన్పూర్‌ -  లక్నో - వారణాసి, ఢిల్లీ - జైపూర్‌ - ఉదయ్‌పూర్‌ - అహ్మదాబాద్‌, ముంబై - నాసిక్‌ - నాగ్‌పూర్‌, ముంబై - పూణే - హైదరాబాద్‌, చెన్నై - బెంగళూరు - మైసూర్‌, ఢిల్లీ - ఛండీగడ్‌ - లూథియానా - జలంధర్‌ - అమృత్‌సర్‌, వారణాసి - పాట్నా - హౌరా మార్గాలు ఉన్నాయి.

నిర్మాణంలో
మొదట ప్రతిపాదించిన 8 కారిడార్లలో ముంబై - అహ్మబాబాద్‌ రూట్‌లో 508 కిలోమీటర్ల నిడివితో బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీని కోసం ముంబై అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ పేరుతో ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేశారు. మరోవైపు ముంబై - హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు మార్గానికి సంబంధించి భూ సేకరణ పనులు షురూ అయ్యాయి. మిగిలిన ప్రాజెక​‍్టులకు సంబంధించి డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. 

కొత్తగా నాలుగు
ప్రస్తుతం డీపీఆర్‌లు రెడీ అయిన ప్రాజెక్టులతో పాటు మరో నాలుగు మార్గాల్లో బుల్లెట్‌ రైలుని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో బెంగళూరు - హైదరాబాద్‌ (618 కి.మీ), నాగ్‌పూర్‌ - వారణాసి (855 కి.మీ), పట్నా - గువహాటి (850 కి.మీ), అమృత్‌సర్‌ - పఠాన్‌కోట్‌ - జమ్ము (192 కి.మీ) మార్గాలను ఉన్నాయి. వీటిని ఇప్పటికే నేషనల్‌ రైల్‌ ప్లాన్‌ 2022లో చేర్చారు. త్వరలో ఈ మర్గాల్లో బుల్లెట్‌ రైల్‌ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నారు. 

ఉత్తరాదికే ప్రాధాన్యం
కేంద్రం అమలు చేస్తోన్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో గుజరాత్‌, ఉత్తర్‌  ప్రదేశ్‌ రాష్ట్రాలు గణనీయంగా లబ్ధి పొందనుండగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళా, ఆంధప్రదేశ్‌లతో పాటు ఒడిషా, ఝార్ఖండ్‌లను పూర్తిగా విస్మరించారు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు కంటితుడుపు చర్యలా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. 

చదవండి: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top