ఆగ్రో కెమికల్స్కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.
‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.
ఇక ఆగ్రోకెమికల్స్ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.
రుణ భారం నియంత్రణలోనే..
తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. లాక్డౌన్ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.
చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్Šస్పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.
‘‘ఆగ్రో కెమికల్స్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ వివరించారు.
అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.


