
జూన్లో 5.2 శాతం పెరుగుదల
కేర్ ఎడ్జ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: జీవితేతర బీమా (నాన్ లైఫ్) కంపెనీల ప్రీమియం ఆదాయం జూన్లో రూ.23,422 కోట్లుగా ఉంది. 2024 జూన్ నెల ప్రీమియం ఆదాయంతో పోల్చి చూస్తే 5.2 శాతం వృద్ధి చెందింది. కానీ, 2024 జూన్ నెలలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదాయం 8.4 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ‘‘1/ఎన్ నిబంధనకు మారాల్సి రావడం పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్లో వృద్ధి సింగిల్ డిజిట్కు నిదానించింది.
ప్యాసింజర్ వాహన బీమా వృద్ధి ఆగిపోయింది. ఈ ప్రభావాన్ని బీమా సంస్థలు ఇతర వాణిజ్య మర్గాల రూపంలో కొంత వరకు తగ్గించుకోగలిగాయి’’అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది. ప్రీమియం వృద్ధి మోస్తరుగానే ఉన్నప్పటికీ 2024–25లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.3 లక్షల కోట్ల మార్క్ను అధిగమించినట్టు గుర్తు చేసింది. నియంత్రణపరమైన మద్దతు, ఇన్సూర్టెక్కు ఆమోదం (టెక్నాలజీ ఆధారిత బీమా సంస్థలు), డిజిటలైజేషన్ వేగవంతం కావడం, మధ్యతరగతి ప్రజలు పెరగడం అనుకూలించినట్టు తెలిపింది.
వృద్ధి వేగం
‘‘బీమా ట్రినిటీకి ప్రభుత్వ పరమైన మద్దతుతో నాన్లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధి వేగాన్ని అందుకోనుంది. రిటైల్ హెల్త్ విభాగంలో స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు (ఒక్క ఆరోగ్య బీమా సేవలు అందించేవి) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి’’అని కేర్ఎడ్జ్ తెలిపింది. మోటారు బీమా వృద్ధి విషయమై రానున్న రోజుల్లో వాహన అమ్మకాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, థర్డ్ పార్టీ బీమా టారిఫ్ల సవరణను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతిపాదిత కాంపోజిట్ లైసెన్స్ అమల్లోకి వస్తే మధ్య కాలానికి ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడింది. 1/ఎన్ నిబంధన అన్నది పాలసీలకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ఆరంభంలోనే కాకుండా.. కాలవ్యవధి మొత్తానికి సమానంగా వెల్లడించడానికి సంబంధించినది.