దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తూ, పన్ను వసూళ్ల నిర్వహణలో భారత్ మరో ఘనతను నమోదు చేసింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆగస్టు నెలలో స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సంవత్సర ప్రాతిపదికన 14.8 శాతం పెరిగి రూ.1,99,853 కోట్లకు (దాదాపు రూ.2 లక్షల కోట్లు) చేరాయి. గత ఏడాది (2025) ఆగస్టులో నమోదైన రూ.1,74,116 కోట్లతో పోలిస్తే ఇది అధికం.
దిగుమతులు, వర్తకమే ప్రధాన చోదకాలు
ఈ వృద్ధికి ప్రధాన కారణం దిగుమతులపై పన్ను ఆదాయం ఏకంగా 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరడమే. అదే సమయంలో దేశీయంగా జరిగిన లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 9.3 శాతం వృద్ధితో రూ.1,37,249 కోట్లుగా నమోదయ్యాయి. పన్ను చెల్లింపుదారుల సమర్థవంతమైన రిఫండ్ ప్రక్రియ వల్ల రిఫండ్లు 67.9 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు చేరినప్పటికీ నికర జీఎస్టీ వసూళ్లు 8.3 శాతం పెరిగి రూ.1,68,057 కోట్లకు చేరడం ఆర్థిక స్థిరత్వానికి అద్దం పడుతోంది.
ఆర్థిక రంగానికి కొత్త ఊపు
మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం నమోదు కావడం, ఆ వరుసలోనే పన్ను వసూళ్లు కూడా నిలకడగా కొనసాగడం భారతీయ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులను సూచిస్తోంది. పన్ను రేట్ల నిలకడ, కంప్లయన్స్ యంత్రాంగం బలోపేతం కావడం వల్ల నెలవారీ వసూళ్లు సగటున రూ.2 లక్షల కోట్ల స్థాయిలో స్థిరపడుతున్నాయి.
రాబోయే సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు వచ్చిన ఈ గణాంకాలు ప్రభుత్వానికి పెద్ద ఊరట నిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.
ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!


