Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల | economic survey 2024-25 released by central minister nirmala sitharaman | Sakshi
Sakshi News home page

Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల

Jul 22 2024 12:12 PM | Updated on Jul 23 2024 9:01 AM

economic survey 2024-25  released by central minister nirmala sitharaman

దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్‌లో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయిండ్‌ బిజినెస్‌’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్‌ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్‌ 2024-25ను ప్రకటిస్తారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘ఆర్థిక సర్వేలో 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. బడ్జెట్‌ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నాం. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయి’ అన్నారు. 

ఆర్థిక సర్వే 2023-24లోని వివరాల ప్రకారం..

కేంద్ర ఆర్థిక సలహాదారు మీడియా సమావేశం

  • దేశం ఏటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్ర ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ మీడియాతో తెలిపారు.

  • నియంత్రణల సడలింపు ద్వారా ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేస్తుంది.

  • ప్రధాన ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఇది 4 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.

  • దేశ వృద్ధిలో ప్రైవేట్‌, ప్రభుత్వరంగ విభాగాలదే కీలక పాత్ర.

  • వృద్ధిని మెరుగుపరచడానికి అందుబాటులోని అన్ని విధానాలు, వనరులను ఉపయోగించుకోవడం చాలా అవసరం.

  • ‘వికసిత్‌ భారత్’గా ఎదగడానికి దేశీయ వృద్ధి కీలకంగా మారనుంది.

  • ఈ ఆర్థిక సర్వే థీమ్‌ ‘ఆల్ హ్యాండ్ ఆన్ టేబుల్’.

  • మే 2024 నాటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాలు గణనీయమైన ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా 2023-24లో రూ.1.28 లక్షల కోట్లకు మించి పెట్టుబడులు సమకూరాయి.

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కనబరుస్తుంది. 

  • ప్రైవేట్ మూలధన వ్యయం (కాపెక్స్) పెరుగుతోంది.

జీసీసీ ఏర్పాటుకు సులభమైన విధానాలు

  • దేశీయంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే విధానాలను సులభతరం చేశారు.

  • 150 కంటే ఎక్కువ సంస్థలు గత రెండు సంవత్సరాలుగా దేశంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి.

  • 1985లో బెంగళూరులో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జీసీసీకు నాందిపడింది.

  • జీసీసీల ఏర్పాటుకు ఆన్‌లైన్ ఆమోదాలు, లైసెన్సింగ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించే ప్రక్రియలను ‘డిజిటల్ ఇండియా’ వంటి వ్యూహాత్మక కార్యక్రామాలు చాలా ప్రభావితం చేశాయి.

  • దేశీయంగా 10 నెలలకు పైగా సరిపడే దిగుమతులను చేసేంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి.

పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు 68 బిలియన్‌ డాలర్లు పెరిగాయి.

  • గత దశాబ్దంలో అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా 7 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరి.

  • బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.

  • ప్రజారోగ్యం దిగజారేందుకు నియంత్రణలేని ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణాలుగా ఉన్నాయి.

  • ఈ హానికర అలవాట్లకు ప్రైవేట్ రంగం సహకరిస్తోంది.

  • క్లిష్టమైన, అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌పై చైనా దాదాపు గుత్తాధిపత్యం ఉంది. దీనివల్ల ప్రపంచం ఆందోళన చెందుతోంది. దేశ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో విశేష మార్పులు చోటుచేసుకోవాలి.

ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌.. గ్రామాల దుస్థితికి సూచిక కాదు

  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌ ఏర్పడడం గ్రామాల దుస్థితికి సూచిక కాదు. ఇది ప్రధానంగా రాష్ట్రాల సంస్థాగత నిర్ణయం, ​​కనీస వేతనాల్లో వ్యత్యాసం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.

  • 2023-24లో 8.2 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక రంగం ఊతాన్నిచ్చింది. ఈ రంగం వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదైంది.

  • గత దశాబ్దంలో తయారీ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదైంది. అందుకోసం కెమికల్స్‌, వుడ్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఫర్నిచర్, రవాణా పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు వంటి విభాగాల్లో వృద్ధి నమోదైంది.

  • భారతదేశంలో గతేడాది 997.2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి జరిగింది. 261 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంది. మొత్తంగా 1233.86 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగించారు.

  • ఆర్థిక సర్వే ప్రకారం మే 2024 వరకు రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. దీనివల్ల రూ.10.8 లక్షల కోట్ల ఉత్పత్తి/ అమ్మకాలు జరిగాయి.

  • భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగాయి.

టమాటా, ఉల్లి ధరల పెరుగుదల

  • అననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిని అడ్డుకున్నాయి. ఉల్లిగడ్డ, టమాటా ధరలు పెరిగేలా చేశాయి.

  • నిర్దిష్ట పంట తెగులు, రుతుపవన వర్షాలు ముందుగానే కురవడం, రవాణా అంతరాయాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి.

  • రబీ ఉల్లి నాణ్యత దెబ్బతినడం, ఖరీఫ్‌లో ఉల్లిని ఆలస్యంగా విత్తడం, ఇతర దేశాల వాణిజ్య సంబంధిత చర్యల కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి.

  • బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే 2015-2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉండవచ్చు.

తగ్గిన రిటైల్‌ ఇంధన ద్రవ్యోల్బణం

  • 2023-24లో ప్రపంచ ఇంధన ధరల సూచీ భారీగా క్షీణించింది. మరోవైపు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.

  • ఆగస్టు 2023లో ప్రభుత్వం దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరలు తగ్గించింది. దేశంలోని అన్ని మార్కెట్‌ల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గింది. అప్పటి నుంచి ఎల్‌పీజీ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2023 నుంచి దిగొస్తోంది.

భారీగా పెరిగిన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌

  • భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.

  • బలమైన లేబర్ మార్కెట్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది.

  • యువతకు ఇంకా పెద్దమొత్తంలో ఉపాధి కల్పించాలి.

  • మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల నిర్మాణ రంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

  • వ్యవసాయాన్ని విడిచిపెట్టిన శ్రామిక శక్తిని తిరిగి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి.

  • ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగింది. దాంతో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. 2023-24లో స్థూల స్థిర మూలధన వ్యయం 9 శాతం పెరిగింది.

దేశ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి

  • 2022-23లో సగటున 6.7 శాతం ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ సమస్యలు, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవనాల మార్పుల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోంది.

  • 2023-24లో మూలధన వ్యయ లోటు(సీఏడీ) జీడీపీలో 0.7 శాతంగా ఉంది. ఇది 2022-23 జీడీపీలో 2.0 శాతంగా ఉంది.

  • ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

  • కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ బ్యాలెన్స్ షీట్స్‌ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

  • భారత వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్‌లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..

ఆర్థిక సర్వే విడుదలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న ‘అమృత్‌కాల్‌’కు ఈ బడ్జెట్‌ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్‌ ప్రభుత్వం కలలుకనే ‘విక్షిత్ భారత్’కు పునాది వేస్తుంది’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement