సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్ పోర్ట్లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్వేస్ శాఖ తెలిపింది. ’మారిటైమ్ ఇండియా విజన్ –2030’, ’హరిత సాగర్’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాం ద్వారా డీజిల్ టగ్ల స్థానంలో ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ టగ్ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్ సరఫరా చేసే ‘‘వన్షోర్ పవర్ సప్లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా ‘దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, పారాదీప్ పోర్ట్ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.
వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్ షిప్పింగ్) అభివృద్ధి, గ్రీన్ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్ బెల్ట్ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.


