ఏప్రిల్‌ వరకు రేట్లలో మార్పులు ఉండవు | Bank Of America Confirmed That There Is No Change In rate and repo rate | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ వరకు రేట్లలో మార్పులు ఉండవు

Feb 5 2022 3:57 PM | Updated on Feb 5 2022 4:01 PM

Bank Of America Confirmed That There Is No Change In rate and repo rate - Sakshi

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ వచ్చే ఏప్రిల్‌ సమీక్షలోపు కీలక పాలసీ రేటు– రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4 శాతం) పెంచకపోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ నెల 7–9 తేదీల్లో ఆర్‌బీఐ సమీక్షా సమావేశం జరగనుంది. 9న పాలసీ ప్రకటన వెలువడుతుంది. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్న క్రమంలో ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఏప్రిల్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తన అంచనాలతో ఓ నివేదికను విడుదల చేసింది. 2020 మే నుంచి రెపో రేటు 4 శాతం వద్దే కొనసాగుతోంది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి. కానీ, బాండ్‌ ఈల్డ్స్‌ మాత్రం పెరుగుతున్నాయి. అయినా కానీ, ఆర్‌బీఐ పాలసీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని క్రమబద్ధంగానే చేపట్టొచ్చని బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. బాండ్‌ మార్కెట్‌కు దేశీయంగా, వెలుపలి అంశాలు అనుకూలంగా లేవని పేర్కొంది. బడ్జెట్‌లో ద్రవ్యస్థిరీకరణకు బదులు వృద్ధికే ప్రాధాన్యం ఇచ్చినందున.. ఆర్‌బీఐ ఎంపీసీ ఈ నెల సమీక్షలో రేట్లను మార్చకపోవచ్చని అంచనా వేసింది. మరోవైపు రివర్స్‌ రెపోను పావు శాతం పెంచొచ్చని మార్కెట్‌లో ఒక వర్గం అంచనా వేస్తోంది. బడ్జెట్‌లో రుణ సమీకరణను స్థూలంగా రూ.14.95 లక్షల కోట్లకు పెంచడం ఇందుకు మద్దతునిస్తోంది. 

6 శాతానికి ద్రవ్యలోటు 
ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉన్న 6.9 శాతం స్థాయి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి తగ్గుతుందని బడ్జెట్‌లో పేర్కొనడం గమనార్హం. బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement