Air India: Cancels Some US Flights In Chaos Over 5G Rollout Tweet Viral - Sakshi
Sakshi News home page

Air India: 5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..!

Jan 19 2022 3:09 PM | Updated on Jan 19 2022 3:27 PM

Air India Cancels Some US Flights In Chaos Over 5G Rollout - Sakshi

Air India Cancels Some US Flights: 5జీ టెక్నాలజీ వల్ల విమాన సేవలు నిలిచిపోవడం ఏంటి ఆశ్చర్యపోతున్నారా?. కానీ, ఇది మాత్రం నిజం.. 5జీ టెక్నాలజీ వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. అమెరికాలో ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రాంతాలలో 5జీ టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేస్తుండటం వల్ల జనవరి 19, 2022 నుంచి భారతదేశం-అమెరికాకు వెళ్లే వాటిలో కొన్ని విమానాల టైమింగ్స్ మార్చడంతో పాటు మరికొన్నింటి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మిగతా వివరాలు తర్వాత అప్డేట్ చేయనున్నట్లు సంస్థ ట్విటర్ వేదికగా పేర్కొంది.

అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం రోల్ అవుట్ చేస్తున్న 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ విమానయాన సేవల మీద వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని, సంక్షోబాన్ని సృష్టిస్తుందని యునైటెడ్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రతి ఏడాది దేశంలోని 40కి పైగా అతిపెద్ద విమానాశ్రయాల గుండా కనీసం 15,000 విమానాలు 1.25 మిలియన్ల యునైటెడ్ ప్రయాణీకులను, చాలా అవసరమైన వస్తువులను కార్గో విమానాలు రవాణా చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ పేర్కొంది. విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 

లేకపోతే పెను ప్రమాదం...
"మేము భద్రత విషయంలో రాజీపడము. కానీ, ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు వినియోగించే 5జీ టెక్నాలజీని ఇక్కడ వినియోగించాలని మేము అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేకపోతే ఆటోపైలెట్, హెడ్-అప్ డిస్ ప్లేలు, భూభాగ హెచ్చరికలు, పిచ్ నియంత్రణ వంటి ఇతర భద్రతా వ్యవస్థలకు సమాచారాన్ని అందించే కొన్ని విమానాల రేడియో ఆల్టిమేటర్లు మీద ఆ సిగ్నల్స్ ప్రభావం పడుతుంది. అంతిమంగా, పెను ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో హ్యూస్టన్, నెవార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రధాన నగరాల్లో ప్రాంతీయ విమానాలపై గణనీయమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుంది" అని ఆ దేశ విమానయాన సంస్థలు సూచించాయి.

దేశం వాణిజ్యం ఆగిపోతుంది
"నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం 5జీ టెక్నాలజీ సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఎటీ అండ్ టీ, వెరిజోన్ సంస్థలు కొనుగోలు చేశాయి.

(చదవండి: 5జీ దెబ్బకు విమాన సేవలకు బ్రేక్..!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement