గర్భిణులు, బాలింతలను ఆస్పత్రికి చేరుస్తున్న వాహనాలు
జిల్లాలో 21 వాహనాల్లో సురక్షితంగా ప్రయాణం
దుమ్ముగూడెం : ఏజెన్సీ ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో 102 వాహనాలు గర్భిణులకు మెరుగైన సేవలందిస్తున్నాయి. గర్భిణులను ఆస్పత్రికి చేర్చడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీటిని వినియోగిస్తున్నారు. గతంలో ఆటోలు, మ్యాజిక్ల ద్వారా గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. 102 వాహనాలు ఏర్పాటు చేశాక ఆశ వర్కర్లు గర్భిణులను ప్రతి నెలా సమీపంలోని పీహెచ్సీలకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 102 వాహనాలు గర్భిణులకు చేయూతనందిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 21 అమ్మఒడి(102) వాహనాలు నిరుపేద గర్భిణులకు సేవలందిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని 102 వాహనం రోజుకు 15 మంది గర్భిణులు, బాలింతల చొప్పున నెలకు 450 నుంచి 500 మందిని ఆస్పత్రికి చేర్చుతోంది. మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సేవలందిస్తోంది.


