భారంగా నడిపిస్తున్నారు..
బ్యాంకు ఖాతాలు తెరవడంలో నిర్లక్ష్యం
పట్టించుకోకుంటే గాడితప్పే అవకాశం
కొత్తగూడెంఅర్బన్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి అభివృద్ధి నిధుల విడుదల లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు ముందుకు నడిపించాల్సి వచ్చిందని, అయినా కనీస గౌవరం దక్కడం లేదని యూనివర్సిటీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీగా మారే అంశం ప్రారంభమైన గత జూన్ నుంచి కూడా పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ విభాగం సభ్యులంతా కంటికి నిద్ర లేకుండా కష్టపడితే ఇటీవల జరిగిన సీఎం ప్రోగ్రాంలో వారికి కనీస గౌవరం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి యూనివర్సిటీగా రూపురేఖలు మారిస్తే సీఎంకు కనీసం బొకే ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదని, కనీసం సీఎం ఉన్న సమయంలో స్టేజీ మీదకు కూడా వచ్చే అవకాశం రాలేదని వాపోతున్నారు. ఇలా ఉంటే భవిష్యత్లో యూనివర్సిటీ కోసం ఏరకంగా పని చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన రిజిస్టర్ బాధ్యత అంతా కూడా తీసుకొని ముందుండి నడిపించాల్సి ఉండగా అలా జరుగలేదని, జిల్లా అధికారుల ఒత్తిడి, ఆదేశాల మేరకు పని చేసిన వారిని ప్రోగ్రాంలో పట్టించుకోకపోవడం చాలా ఇబ్బంది కలిగించిందంటున్నారు.
పరీక్షలపై లేని క్లారిటీ..
డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో సిలబస్ లేకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ అధికారులే మూడు నెలల క్రితం తయారు చేశారు. దీంతో పాటుగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ఫీజులు తీసుకొని, వాటిని యూనివర్సిటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. కానీ, ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో ఆ ఫీజులన్నింటినీ కాకతీయ యూనివర్సిటీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు. యూనివర్సిటీకి ప్రత్యేక అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేదనే ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టిన కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నూతనంగా అడ్మిషన్లు తీసుకొని యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న యూజీ, పీజీ విద్యార్థులకు జనవరిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లే ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని, పైగా యూనివర్సిటీలో పనిచేస్తారా.. కేయూలో పని చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని హెచ్వోడీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు సంబంధించి అధ్యాపకులు ఆరుగురికిపైగా వరంగల్లో డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు. దీంతో బీటెక్లో అధ్యాపకుల కొరత ఒక వైపు వేధిస్తుంటే, మరో వైపు యూనివర్సిటీలో కూడా ఇప్పుడిప్పుడే అధ్యాపకుల నియమాకం జరుగుతుండడం, రెండింటిని కూడా నడిపించడం అధ్యాపకులకు కత్తిమీద సాములాగా మారింది. యూనివర్సిటీకి సంబంధించి పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, టీచింగ్ స్టాఫ్, స్థానికంగా రిజిస్ట్రార్ స్థాయి అధికారి ఉంటే తప్పా యూనివర్సిటీ గాడిలో పడే అవకాశం లేదు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో పరీక్షలపై లేని క్లారిటీ


