ప్రతీ పేషంట్కు వైద్యం అందాలి
భద్రాచలంఅర్బన్: ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్క పేషంట్కు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మిృనాల్ శ్రేష్ఠ అన్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే పేషంట్లపై వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది వ్యవరిస్తున్న తీరుతో పాటు డ్యూటీ డాక్టర్ల విధులపై ఆరా తీసేందుకు ఆయనే స్వయంగా ఓ సామాన్యుడిగా వచ్చి ఓ స్టాఫ్ నర్సు వివరాలపై పలు మార్లు అడిగారు. ఆ సమయాన సదరు స్టాఫ్ నర్సు బదులిచ్చిన తీరును చూసి ఆమెను అభినందించారు. ఏజెన్సీ ప్రాంతం కావున గిరిజనుల ఎక్కువ శాతం వస్తున్నందున సంబంధిత వ్యాధిపై అవగాహన కల్పించాలని అన్నారు.
భద్రాద్రి చిన్నారికి అవార్డు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని యమజాలనగర్ కాలనీకి చెందిన చిన్నారి శ్రీ యాన్వి భగవద్గీత శ్లోకాలను అలవోకగా చెప్పి ‘విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్’వర్సెస్ బ్లూమ్ అవార్డ్స్ను దక్కించుకుంది. హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. చిన్నారి తల్లి సత్య నాగలక్ష్మి గతంలో భగవద్గీత శ్లోకాలపై శృంగేరిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించగా.. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న నాలుగేళ్ల శ్రీ యాన్వి గత ఆరు నెలలుగా శ్లోకాలను నేర్చుకుంది. శ్రీయాన్వి భగవద్గీతలోని 50 శ్లోకాలను, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, బాల రామాయణంలోని కొన్ని శ్లోకాలను ఏకధాటిగా చెప్పే నైపుణ్యాన్ని గుర్తించిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్ సంస్థ చిన్నారికి అవార్డు బహూకరించింది.
బైక్ను ఢీకొట్టిన వ్యాన్..
అశ్వారావుపేటరూరల్: కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ బైక్ వాహనాదారుడిని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా వ్యాన్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని కేశప్పగూడేనికి చెందిన పూసం జోగారావు శనివారం తన బైక్పై వడ్డెర రంగాపురం గ్రామంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మంపాడు దగ్గర ఎదురుగా వచ్చిన ఓ వ్యాన్ ఢీ కొట్టగా.. జోగారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై కొత్తగూడెం ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుమారుడు పూసం పోతురాజు ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా.. వ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రభుత్వ భూమి స్వాధీనం
పాల్వంచరూరల్: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ఆదివారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధి బస్వాతారాకకాలనీ పంచాయతీ పరిధిలోని 61 సర్వే నంబర్లోని మూడెకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఇటీవల కబ్జా చేశారు. దీంతో తహసీల్దార్ దారా ప్రసాద్ ఆదేశాల మేరకు ఆదివారం హెచ్ కన్వేషన్ హాల్ మార్గంలో రోడ్డు కింద 16 ఫీట్ల ప్రభుత్వ భూమిని కబ్జా జరిగిందని సర్వేయర్ ద్వారా సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకుని హద్దులు నిర్దేశించినట్లు ఆర్ఐ నళనీకుమార్ తెలిపారు. ఇట్టి ప్రభుత్వ భూమిని గతంలో కంటి ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించబడిందన్నారు.
ప్రతీ పేషంట్కు వైద్యం అందాలి


