ఓట్లు పడాలంటే..
● ప్రభుత్వ పథకాల ఎర ● విందులు, వినోదాలు..
వైరా: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ.. ప్రభుత్వ పథకాలను ఆశగా చూపిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. వృద్ధాప్య, వితంతు ఫించన్లతో పాటుగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి రెండో పర్యాయం నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామాల్లో తమ హయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కొత్తగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ తమను సర్పంచ్గా గెలిపిస్తే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కారం చేస్తామని ఓట్లు అడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. మహిళ అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు సమస్యల పరిష్కారం తమతో సాధ్యం అవుతుందని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ప్రత్యేక విందులు
పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ పార్టీలు ఇవ్వడం గ్రామాల్లో నిత్యం కనిపిస్తునే ఉంది. ప్రతిరోజూ మద్యంతో పాటుగా చికెన్ దుకాణాల్లో ఏరోజుకు ఆ రోజు కేజీల కొద్ది మాంసాన్ని పంపిణీ చేస్తుండడం విశేషం. ప్రచారం చివరి రోజుల్లో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓట్లు దండుకోవచ్చనే ఉద్దేశంతో అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ విజయమే పరమావధిగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఓట్లు పడాలంటే..


