సామాజిక తెలంగాణకు కృషి
కొత్తగూడెంఅర్బన్: సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ చిత్రషూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్తూ మార్గమధ్యలోని పోస్టాఫీస్ సెంటర్లో ఆగారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు వీరన్న, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లకావత్ సురేష్, రాంబాబు, ఆది, రవికుమార్ పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు..
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
భారతరత్న అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం అంబేద్కర్ సంక్షేమ సంఘం, దళిత బహుజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగంలో రిజర్వేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు సమ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, దళిత సంఘాల నాయకులు డాక్టర్ శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, తాండ్ర వెంకటేశ్వర్లు, సీఐ కరుణాకర్, చెన్నూరి శ్రీనివాస్, చీకటి కార్తీక్, కుంజా కవిత, జేబీ శౌరి, ఎర్రా కామేష్ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ: గుమ్మడి నర్సయ్య చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, మల్లు నందిని, కొత్వాల శ్రీనివాసరావు, నూకల రంగారావు, కాల్వ ప్రకాష్, కాల్వ దేవదాస్, భాస్కర్ రావు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత
సామాజిక తెలంగాణకు కృషి


