సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి
● కేవీకే శాస్త్రవేత్త హేమశరత్చంద్ర
ఇల్లెందురూరల్: రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రయ ఎరువులకు ప్రాధాన్యతనిస్తే నాణ్యమైన, మెరుగైన దిగుబుడులు వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమశరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త శివ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ భరత్ సూచించారు. మండలంలోని పూబెల్లి గ్రామంలో శుక్రవారం మాతృక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు తమ పంట చేలల్లో రసాయన ఎరువుల వినియోగం పెంచడం వల్ల నేల సారాన్ని కోల్పోయి పంట దిగుబడి, నాణ్యతపై ప్రభా వం చూపుతుందన్నారు. దీనికోసం సేంద్రియ ఎరవుల వినియోగం పెంచాలని సూచించారు. సాగులో పంట మార్పిడి పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో చేపపిల్లలను వదిలారు.
వార్షిక లక్ష్యసాధనకు
కృషి చేయాలి
మణుగూరుటౌన్: 2025–26 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 76 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీతకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పీ అండ్ పీ) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి కేసీహెచ్పీలో బెల్ట్ లోడింగ్ సిస్టం, పీకేఓసీ, మణుగూరు ఓసీ గనుల వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియా వార్షిక లక్ష్యం 115 లక్షల టన్నుల ఉత్పత్తికి అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాఘవేంద్రరావు, శ్రీనివాసచారి, రమేశ్, గౌడే, వీరభద్రరావు, సురేశ్కుమార్, రమణారెడ్డి, బైరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
బస్సుకింద పడి
మహిళ మృతి
● ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు అల్పాహారం తెచ్చేందుకు వస్తుండగా ఘటన
ఇల్లెందు: జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమార్తెకు అల్పాహారం తీసుకొచ్చేందుకు బైక్పై వస్తున్న తల్లి బస్సు(క్యారవ్యాన్)కింద పడి మృతిచెందిన ఘటన ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకుంది. స్ట్రట్ఫిట్బస్తీకి చెందిన ఎండీ రహీముద్దీన్, తన భార్య ఎండీ సుహానా (40) దంపతుల కుమార్తె జాస్మిన్కు జ్వరం రావడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆమెకు చపాతీ తీసుకొచ్చేందుకు దంపతులు బైక్పై ఇంటికి వెళ్లి వస్తుండగా ఓ క్యారవ్యాన్ సైడ్ ఇవ్వకుండా వస్తోంది. ప్రభుత్వాస్పత్రి సమీపంలో సైడ్ ఇచ్చినట్టే ఇచ్చి.. డివైడర్ వైపు జరగడంతో క్యారవ్యాన్కింద పడిన సుహానా అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి సీఐ టి.సురేశ్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, జ్వరంతో బాధపడుతున్న కుమార్తె జాస్మిన్.. ఆస్పత్రిలో ఉండగా.. సుహానా మృతదేహం మార్చురీలో ఉంది. దీంతో రహీముద్దీన్, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఐదు నిమిషాలైతే ఆస్పత్రికి చేరుకునేవారమని, వ్యాన్ తన భార్యను బలితీసుకుందని భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.
సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి


