మహిళ ఆత్మహత్య
దమ్మపేట: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన తోట నాగమణి(52) మద్యానికి బానిసగా మారింది. మద్యం తాగినప్పుడు భర్తతో తరచుగా గొడవ పడేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి కలిగి ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్లో అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
టేకులపల్లిలో యువకుడు..
టేకులపల్లి: యువకుడి ఆత్మహత్యపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం... మండలంలోని మద్రాస్తండా పంచాయతీ కొండంగులబోడు గ్రామానికి చెందిన భూక్య భద్రు, బాజు దంపతులకు నలుగురు సంతానం. మూడో సంతానమైన భూక్య వినోద్ (28) కొత్తగూడెంలోని హోండా షోరూమ్లో పని చేస్తున్నాడు. తనకు వివాహం కావడం లేదని కొంతకాలంగా మనోవేదన చెందుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
విద్యుత్ స్తంభాన్ని
ఢీకొన్న కారు
● దంపతులకు స్వల్ప గాయాలు
జూలూరుపాడు: కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దంపతులకు స్వల్ప గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన ఆర్ఎంపీ అజిత్కుమార్, వరలక్ష్మి దంపతులు దైవదర్శనానికి భద్రాచలం కారులో వెళ్తున్నారు. పడమటనర్సాపురం సమీపంలో ముందున్న వాహనాన్ని కారు ఓవర్ టేక్ చేసింది. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న మైలురాయిని, ఆ తర్వాత 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగంగా దెబ్బతినడంతోపాటు విద్యుత్ స్తంభం విరిగింది. కాగా విద్యుత్శాఖ అధికారులు విరిగిన స్తంభాన్ని తొలగించి, మరో స్తంభం ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
పాల్వంచరూరల్ : ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనం వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచ వద్ద సెంటర్లో సోమవారం రాత్రి లారీ ఆగి ఉండగా కొత్తగూడెంలోని గొల్లగూడేనికి చెందిన హర్షిత్, ప్రవీణ బైక్పై వస్తూ లారీని ఢీ కొటారు. దీంతో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సుమన్ తెలిపారు.
గుర్తు తెలియని
మహిళ మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని చర్ల రోడ్లో ఉన్న రాజుపేట కాలనీలో ఓ రిక్షాపై గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
మద్యానికి డబ్బులివ్వలేదని
గొంతుకోసుకున్న యువకుడు
పాల్వంచరూరల్ : మద్యం తాగేందుకు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదంటూ ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన పాల్వంచ మున్సిపాలిటీ పరిఽధిలో చోటుచేసుకుంది. గాంధీనగర్కు చెందిన యువకుడు(22) మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడగగా వారు ఇవ్వలేదు. దీంతో క్షణికావేశంలో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
