అంగన్వాడీ సేవలు విస్తృతం చేయాలి
ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ
సూపర్బజార్(కొత్తగూడెం): మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సేవలు విస్తృతపరచాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారిని జె స్వర్ణలత లెనీనా అధ్యక్షతన సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పోషణ లోపం ఉన్న పిల్లలను న్యూట్రిషన్ రిహాబిటేషన్ కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 295 అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోట పెంపకం చేపట్టినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ ముత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): బ్యాంకు అకౌంట్లకు ఆధార్ సీడింగ్ లేకపోవడంతో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఎస్సీ పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు కావడం లేదని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ.శ్రీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీప పోస్టాఫీసులకు వెళ్లి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. సందేహాలకు పోస్టల్ మేనేజర్ రాజేష్ను 95338 99499 నంబర్లో సంప్రదించాలని కోరారు. కళాశాలల లాగిన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మూడు రోజుల్లో పరిశీలించి డిజిటల్ కీ ద్వారా జిల్లా అధికారి లాగిన్కు ఫార్వార్డ్ చేయాలని వివరించారు.
ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
పాల్వంచరూరల్: తెలంగాణ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ టీఎస్ జెన్కో నూతన అధ్యక్షుడిగా పాల్వంచకు చెందిన వై.వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా పాల్వంచకు చెందిన రిటైర్డ్ కేటీపీఎస్ ఏడీఈ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా సీతారాంరెడ్డి, (కేటీపీఎస్ రిటైర్డ్ ఏడీఈ), 5,6 దశ కేటీపీఎస్ వైస్ ప్రెసిడెంట్గా ఏ.నాగేశ్వరరావు (బీటీపీఎస్ ఏడీఈ), కోశాధికారిగా ఎస్.ఎస్.చందర్రావు(కేటీపీఎస్ )లతోపాటు మరికొందరిని ఎన్నుకున్నారు.
25 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కొత్తగూడెంలోని సెయింట్మెరీస్ హై స్కూల్లో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్పైర్ అవార్డుల ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు నూతన ఆవిష్కరణలతో కూడిన బోధనా అభ్యాసనా సామగ్రిని ప్రదర్శించవచ్చుని, బీఈడీ, డీఈడీ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని వివరించారు. ప్రదర్శనలో రెండో రోజు సెమినార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు సంసిద్ధం కావాలని సూచించారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఆ.సంపత్ కుమార్ను 90100 43945 నంబర్లో సంప్రదించాలని కోరారు.
పట్టు పురుగుల
పెంపకంతో ఆదాయం
సూపర్బజార్(కొత్తగూడెం): పట్టు పురుగుల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగ కిషోర్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో సాగు చేస్తున్న మల్బరీ యూనిట్ను సోమవారం ఆయన సెరీకల్చర్ అధికారి నరేందర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తే పట్టుపురుగుల పెంపకం ద్వారా ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు మల్బరీ సాగు చేపట్టాలని సూచించారు. తద్వారా ఆర్థిక వృద్ధి సాధించవచ్చని అన్నారు.
							అంగన్వాడీ సేవలు విస్తృతం చేయాలి
							అంగన్వాడీ సేవలు విస్తృతం చేయాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
