
ప్రణాళికే కీలకం
గోదావరి పుష్కరాలకు
గతంలో 2015లో..
పన్నెండేళ్లకు ఒకమారు జరిగే పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. మళ్లీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి అత్యధిక భక్తులు తరలివస్తుంటారు. గత పుష్కరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని పేర్కొంటుండగా, 2027లో కోటి మందికి పైగానే భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం, పర్ణశాల, మోతె తదితర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
భద్రాచలం: భక్తులు మహా పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు రెండేళ్ల సమయమే ఉంది. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ప్రకటించారు. కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద నున్న త్రయంబకంలో పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. గోదావరి రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 180 కిలోమీటర్లు ప్రవహించగా, విభజనం అనంతరం ఏపీలో ఏడు మండలాలు విలీనం చేయటంతో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 కిలోమీటర్లు ప్రవహిస్తోంది.
ప్రణాళిక ప్రకటించని ప్రభుత్వం
2027లో పుష్కరాలను విజయవంతం చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా స్నానఘాట్ల పెంపు, రోడ్లు వెడల్పు, ఆలయ పరిసర ప్రాంతాల విస్తరణ, భక్తులకు శాశ్వత, తాత్కాలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందస్తు పనులకు రూ.50 కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఘాట్ల పెంపు, ఇతర మౌలిక వసతుల కల్పనకు, శాశ్వత పనులకు ఇంకా నిధులు అవసరమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ పుష్కరాల పనులపై సమీక్ష, బడ్జెట్తో ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏ ప్రకటనా వెలువడలేదు. పుష్కరాలను ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ప్రణాళిక, నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
ముందస్తు ప్రణాళిక ప్రకటించాలి
2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలంటే ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం. నేను 2003, 2015 పుష్కర స్నానాలను భద్రాచలంలోనే చేశాను. భక్తుల రద్దీ, గత అనుభవాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసి ఏర్పాట్లు చేయాలి.
– పరిమి సోమశేఖర్, భక్తుడు
2027 జూలై 23 నుంచి
ఆగస్టు 3 వరకు పుష్కరాలు
కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా
ఇంకా ప్రణాళిక, నిధులు విడుదల చేయని ప్రభుత్వం
ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించాలని వేడుకోలు

ప్రణాళికే కీలకం