
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు
చుంచుపల్లి: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. పల్లెలు పారిశుద్ధ్య సమస్యతో సతమతమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. గతేడాది జనవరితో సర్పంచుల పదవీకాలం ముగియగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారులకు అప్పగించారు. ఎంపీపీ, జెడ్పీ పాలక మండళ్ల గడువు సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, అక్కడా స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల్లోనూ పాలక వర్గాల గడువు ఈ ఏడాది జనవరిలో ముగియగా పాలన బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న మండల స్థాయి అధికారులకు ఒక్కొక్కరికి 2 నుంచి 4 గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు కేటాయించారు. జెడ్పీకి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తుండగా, మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు రెండు మున్సిపాలిటీల పాలన పర్యవేక్షణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు అప్పగించారు.
కార్యదర్శులపైనే భారం
స్థానిక సంస్థల పాలన పట్టించుకోవాల్సి అధికారులు కనీసం అటువైపు రావడం లేదనే ఆరోపణలున్నాయి. భారం అంతా గ్రామాల్లో కార్యదర్శుల పైనే పడుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారులు కూడా పాలనను పట్టించుకోవడంలేదనే పలువురు పేర్కొంటున్నారు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల విడుదల చేయకపోవడంతో పాలన పూర్తిగా పడకేసింది. వర్షాకాలం సీజన్ను ప్రారంభమవుతున్నా దృష్టా ప్రత్యేక అధికారులు మేల్గొనాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు పర్యవేక్షించాలి
గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వర్షాకాలం సీజన్లో అప్రమత్తంగా ఉండాలి. సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను మరోసారి ఆదేశిస్తాం.
– ఎం.విద్యాచందన, అదనపు కలెక్టర్
ఎన్నికలు నిర్వహించాలి
ప్రత్యేకాధికారులు గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మరోవైపు పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
– మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి
గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు
పంచాయతీలను పట్టించుకోని
ప్రత్యేకాధికారులు
మున్సిపాలిటీల్లోనూ అదే తీరు
గ్రామపంచాయతీలు 481
జిల్లా పరిషత్ 1
మండల పరిషత్లు 22
లోపిస్తున్న జవాబుదారీతనం
పదవీకాలం ముగిసి ఏడాది దాటినా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్నది స్పష్టతలేదు. మండల, జిల్లా పరిషత్ల పాలన గడువు ముగిసి పది నెలలు అవుతున్నా ఎన్నికలకు ప్రభుత్వం విముఖత చూపుతోంది. ప్రత్యేకాధికారులు పనిభారం తదితర కారణాలతో గ్రామ పాలన పట్టించుకోవడంలేదు. తమకు సొంత శాఖ విధులతోనే సరిపోతోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులతో జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. పాలనాభారం గ్రామ కార్యదర్శులు మోస్తున్నా నిధులు లేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక అధికారులను నియమించినా ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. కాగా ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసంతో పాటు మరికొన్ని పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది.

పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు

పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు