
జేకే ఓసీ విస్తరణకు అనుమతులు
ఇల్లెందు: జేకే–5 ఓసీ విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. ఈ మేరకు బుధవారం సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య వివరాలు వెల్లడించారు. జేకే–5 ఓసీ మూతపడనున్న నేపథ్యంలో యజమాన్యం పలువురు ఉద్యోగులను బదిలీ చేసింది. జేకే ఓసీ విస్తరణ అనుమతుల్లో జాప్యం జరిగింది. పలు దఫాలు ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఆలస్యం కావటంతో ఓసీ విస్తరణ పట్ల ఆందోళన వ్యక్తమైంది. సీఎండీతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పలు దఫాలు సింగరేణి అధికారులు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, గుర్తింపు సంఘం నాయకులు ఒత్తిడి పెంచడంతో తుది అనుమతులు బుధవారం లభించాయి. దీంతో కార్మికులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2023 ఏప్రిల్ 26న జేకే ఓసీ విస్తరణకు సింగరేణి ప్రజాభిప్రాయం సేకరించింది. రూ.297.88 కోట్లతో 1114.507హెక్టార్ల భూమిలో 2.50 మిలియన్ టన్నుల బొగ్గు సేకరణ కోసం అనుమతి కోరారు. ప్రస్తుతం 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే అనుమతి లభించినట్లు జీఎం తెలిపారు. విస్తరణ పనులు చేపట్టి బొగ్గు వెలికితీతకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆసుపాక బీపీఎంపై సస్పెన్షన్ వేటు
అశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్పై బుధవారం తపాలా శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గడిచిన ఏడాది కాలంగా గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిన ఉత్తరాలు, ఆధార్, ఏటీఎం, బీమా, ఇతర నోటీసు పత్రాలను పంపిణీ చేయడం లేదని, ఈ నెల 26వ తేదీన గ్రామస్తులు వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు పోస్టుమాస్టర్ శశాంక్పై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అశ్వారావుపేట ఎస్పీఎం సాయిబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పాల్వంచ డివిజన్ ఇన్చార్జి పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఆసుపాక గ్రామంలో విచారణ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలను నమోదు చేసి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోస్టుమాస్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు.
1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సన్నాహాలు