
తుప్పు పడుతున్న శిక్షణ !
ఐటీడీఏ ఆధ్వర్యంలో వైటీసీల ఏర్పాటు
● కేంద్రాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ ● భూత్బంగ్లాను తలపిస్తున్న ఇల్లెందు సెంటర్ ● ఇలాగైతే యువతలో నైపుణ్యం పెంచేది ఎలా..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘మన విద్యార్థుల దగ్గర పేరుకే సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ జాబ్ మార్కెట్కు తగ్గ స్కిల్స్ ఉండడం లేదు’ అని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అచ్చంగా అదే పరిస్థితి జిల్లాలోనూ నెలకొంది. గిరిజన యువత కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నా అక్కడ శిక్షణే ఇవ్వడం లేదు.
దశాబ్దాల క్రితమే వైటీసీలు..
రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీలు సాధించిన విద్యార్థుల వద్ద కూడా జాబ్ ఓరిఝెంటెడ్ స్కిల్స్ కొరవడ్డాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న యువతతో పాటు రాబోయే తరానికి కూడా ఇప్పటి జాబ్ మార్కెట్కు తగ్గట్టుగా నైపుణ్యం ఉండేందుకు వీలుగా ఏకంగా సిల్క్ యూనివర్సిటీనే ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్కిల్స్కు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అయితే రేవంత్రెడ్డి సర్కార్ కంటే దశాబ్దాలకు ముందే గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రతీ ఐటీడీఏ పరిధిలో ప్రత్యేకంగా యూత్ ట్రైనింగ్ సెంటర్లను (వైటీసీ) నిర్మించారు. భద్రాచలంలోని వైటీసీ రాష్ట్ర విభజనతో ఏపీలోకి వెళ్లడంతో ఇల్లెందులో కొత్తగా మరొకటి నిర్మించారు. ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏ క్యాంపస్లో మరో వైటీసీని అందుబాటులోకి తెచ్చారు. శిక్షణ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు/ఉద్యోగార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. అయితే ఆరంభంలో జోరుగా సాగిన శిక్షణ కార్యక్రమాలు ఆ తర్వాత మందగించాయి. ఒకప్పుడు వెంటవెంటనే జరిగిన జాబ్మేళాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి.
పట్టించుకునే నాథులేరి ?
హైదరాబాద్ – కొత్తగూడెం జాతీయ రహదారి పక్కనే ఇల్లెందు డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న వైటీసీ ఎప్పుడూ తాళం వేసే ఉంటోంది. సకల సకర్యాలున్న భవనం ఇలా పడావు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లా స్థాయి అధికారులు ఒకసారి ఈ వైటీసీని సందర్శిస్తే గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో తెలుస్తుంది. ఎంత మంచి పని ముట్టయినా ఉపయోగించకుంటే తుప్పు పట్టినట్టు సకల సౌకర్యాలున్న వైటీసీలు శిక్షణ లేక దుమ్ముకొట్టుకుపోతున్నాయి.

తుప్పు పడుతున్న శిక్షణ !

తుప్పు పడుతున్న శిక్షణ !