
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, స్వామివారిని రాష్ట్ర మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈఓ రమాదేవి స్వాగతం పలకగా పండితులు వేదాశీర్వచం అందించారు.
పెద్దమ్మతల్లి హుండీ ఆదాయం
రూ.23.42 లక్షలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 80 రోజులకు గాను రూ.23,42,780తో పాటు రెండు విదేశీ కరెన్సీ లభించాయని, మిశ్రమ బంగారం, వెండి కూడా లభ్యమయ్యాయని ఈఓ రజినీకుమారి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి జి.సుదర్శన్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.
అమ్మవారికి సువర్ణ పుష్పార్చన..
శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సుకు
జిల్లా అధికారి
కొత్తగూడెంఅర్బన్: ఢిల్లీలో యూనిసెఫ్ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వి.మధువరణ్ హాజరయ్యారు. మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలు, దేశంలో వాతావరణ అనుకూలత కోసం ఆవిష్కరణలు, పరస్పర అధ్యయనాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై సదస్సు జరుగనుండగా దేశంలోని పలువురు ప్రముఖులు, వైద్యారోగ్య శాఖ నిపుణులు అవగాహన కల్పించారు. జిల్లా నుంచి హాజరైన మధువరణ్ కూడా పలు సూచనలు చేశారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం