
పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ● ఏ ఒక్క అనర్హుడికి ఇల్లు మంజూరైనా బాధ్యులపై చర్యలు ● ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక దృష్టి ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఽవర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, సాగు ప్రణాళికలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తొలుత ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి.పాటిల్ జిల్లాల వారీగా పథకాలు అమలు నివేదికలు వెల్లడించారు.
నకిలీలు అమ్మితే కఠిన చర్యలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోకి నకిలీలు రాకుండా ఏపీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అలాగే, భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై సూచనలు చేశారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తొలి దశలో అరికట్టడమే కాకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేయాలని, జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఆశాజనకంగానే ఉన్నా మరింత పెరగాలని సూచించారు. ఇక రుతుపవనాలు ముందుగా వచ్చినందున సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చాలని సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. నిల్వలను తరచుగా పరిశీలిస్తూ ఎక్కడా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసైన్డ్ భూముల్లో పొజిషన్లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నందున ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే, సాదా బైనామా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని తెలిపారు. జూన్ 10 లోపు పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు అవసరమైన ఇసుక టోకెన్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు. అంతేకాక సగంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తిచేయించాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యులు, సిబ్బందిని పెంచాలని కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా చూడాలన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, ఖమ్మం సీపీ సునీల్ దత్, ఎస్పీ బి.రోహిత్ రాజ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.