ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటున్న బెల్ట్షాప్ నిర్వాహకులు
వారికి మద్యం సరఫరాపై కన్నెర్ర చేస్తున్న సిండికేట్
ఇల్లెందు ఘటనతో వెలుగుచూసిన వైరం
రేటు పెంచిన సిండికేటు..
లైసెన్స్ పొందిన వైన్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్మాల్సి ఉంటుంది. అయితే ఎమ్మార్పీకి అమ్మితే లాభాలు పెద్దగా రావనే ఉద్దేశంతో మద్యం వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, వైన్స్లలో పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా చూస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మద్యాన్ని బెల్ట్షాపుల ద్వారా అధిక ధరలకు అమ్ముతుంటారు. క్వార్టర్ బాటిల్పై ఎమ్మార్పీ ధర కంటే రూ.20 ఎక్కువకు బెల్ట్షాప్లకు విక్రయిస్తే వారు మరో రూ.20 కలిపి ఎమ్మార్పీకంటే రూ.40 అదనంగా అమ్ముతుంటారు. జిల్లాలోని అనేక పట్టణాల్లో ఈ దందా చాలా రోజులుగా కొనసాగుతోంది. అయితే ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పట్టణాల్లో సిండికేట్ నిర్వాహకులు తమ లాభాలను మరింతంగా పెంచుకునేందుకు ఎమ్మార్పీపై రూ.30 వరకు అదనంగా అమ్మడం మొదలుపెట్టారు.
బయట నుంచి మద్యం..
సాధారణంగా పట్టణాలు, పెద్ద మండల కేంద్రాల్లో మద్యం నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడుతుంటారు. వీరి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై వారిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. సిండికేట్ చెప్పిన ధరకు మద్యం కొనుగోలు చేయడంతో కష్టం తమది.. లాభం వారికి పోతోందని భావించిన బెల్ట్షాపు నిర్వాహకుల్లో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. సిండికేట్ లేని పట్టణాల్లోని వైన్స్ నుంచి ఎమ్మార్పీకే భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేయడం మొదలెట్టారు. కొన్నాళ్లుగా చాపకింద నీరులా నడుస్తున్న ఈ వ్యవహారం ఇటీవల ముదురుపాకాన పడింది.
ఇల్లెందు ఘటనతో
మణుగూరు సిండికేట్తో విభేదించిన కొందరు బెల్ట్షాప్ నిర్వాహకులు మహబూబాబాద్ నుంచి భారీ ఎత్తున మద్యం తీసుకెళ్తున్నారనే విషయం ఇల్లెందు ఎకై ్సజ్ పోలీసులకు ఉప్పందింది. దీంతో దారి కాచి భారీగా సరఫరా అవుతున్న మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అయితే ఈ దాడి జరగడం వెనుక సిండికేట్ హస్తం ఉందని బెల్ట్షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇల్లెందు ఎకై ్సజ్ పరిధిలోనూ ఇలాంటి దాడులు అనేకం జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. బెల్ట్షాపుల్లో మద్యం అమ్మడం నేరమైనప్పుడు, సిండికేట్ రూపంలో ఎమ్మార్పీకి మద్యం అమ్మకపోవడం కూడా చట్టరీత్యా నేరమేనని అంటున్నారు. సిండికేట్ ఘనాపాఠీల వ్యవహారాలను చూసీచూడనట్టుగా వదిలేయడం, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్లలో నడుపుకునే బెల్ట్షాపులపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సిండికేట్ అత్యాశ కారణంగా తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని, దీనిపై ఎకై ్సజ్ శాఖ దృష్టి పెట్టాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ను వివరణ కోరగా తాము ఎక్కడా దాడులు చేయడం లేదని చెప్పారు.
బెల్ట్షాప్ నిర్వాహకుల్లో అసంతృప్తి..
గ్రామాల్లో కిరాణా దుకాణాలు, పాన్షాపులు, బడ్డీకొట్లు బెల్ట్ షాపులుగా రూపాంతరం చెందాయి. స్థానికంగా ఉండే వారే ఎక్కువగా ఇక్కడ మద్యం తాగుతుంటారు. వారికి ప్లాస్టిక్ గ్లాసులు, మంచినీరు, పల్లీలు తదితర తినుబండారాలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోంది. దీంతో తమ లాభాలు తగ్గిపోతున్నాయనే అసంతృప్తి బెల్ట్షాపుల నిర్వాహకుల్లో ఉంది. బార్లు, వైన్స్, కౌంటర్ల వద్ద ప్లాస్టిక్ గ్లాస్కు కూడా డబ్బు వసూలు చేస్తారు. కానీ స్థానికంగా ఉండే పరిచయాలు, పరిస్థితుల కారణంగా తాము గ్లాసులకు బిల్లు వేయలేక నష్టపోతున్నామనేది బెల్ట్షాపుల వారి బాధ. అంతేకాదు.. అధిక ధరకు మద్యం అమ్ముతుంటే తమకు మందుబాబుల నుంచి ఇబ్బంది ఎదురవుతోందని అంటున్నారు. ఈ తరుణంలో క్వార్టర్ బాటిల్పై సిండికేట్ వారు అదనంగా వసూలు చేసే రూ.20లో తగ్గింపు ఇవ్వాలని కోరుతున్న తరుణంలో రేటు మరింతగా పెంచడం వివాదానికి బీజం వేసింది.

బెల్ట్

బెల్ట్