రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

May 10 2025 8:03 AM | Updated on May 10 2025 8:03 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పర్యావరణంపై

పోటీలకు ఆహ్వానం

చుంచుపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై పోటీలు నిర్వహిస్తున్నట్లు పర్యావరణ శాఖ ఇంజనీర్‌ రవీందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పనితీరు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, నీటి సంరక్షణ తదితర అంశాలపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, ఆస్పత్రులు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కళాశాలలు, పాఠశాలలు పోటీల్లో పాల్గొనవచ్చని వివరించారు. జూన్‌ 5న హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో 1వ, 2వ, 3వ బహుమతులు ఇస్తామని తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి

పరిశ్రమల భద్రతాధికారుల

సమావేశంలో ఎస్పీ రోహిత్‌

కొత్తగూడెంఅర్బన్‌: భారత్‌–పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమల భద్రతాధికారులతో శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్వాపురం భారజల కర్మాగారం, సారపాక ఐటీసీ, కేటీపీఎస్‌, బీటీపీఎస్‌, నవ లిమిటెడ్‌ కంపెనీల భద్రతాధికారులు, సంబంధిత పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నియమ నిబంధనలను పాటించాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. అలారం సిస్టమ్‌ విధానంపై కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబాలు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల ప్రవేశ ద్వారాల వద్ద ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా పకడ్బందీగా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసుకుని పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు. భారజల కేంద్రం కమాండెంట్‌ అమిత్‌ కుమార్‌, డీఎస్పీలు రవీందర్‌రెడ్డి, సతీష్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌,ీ వెంకటేశ్వర్లు, అశోక్‌ రెడ్డి, ఐటీసీ సెక్యూరిటీ ఆఫీసర్‌ మనీష్‌ శర్మ, కేటీపీఎస్‌, బీటీపీఎస్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు చంద్రశేఖర్‌, తిరుపతి పాల్గొన్నారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/1

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement