సుమనోహరం.. రామయ్య నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

సుమనోహరం.. రామయ్య నిత్య కల్యాణం

May 9 2025 12:27 AM | Updated on May 9 2025 12:27 AM

సుమనోహరం.. రామయ్య నిత్య కల్యాణం

సుమనోహరం.. రామయ్య నిత్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించిన అర్చకులు మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్‌,రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

నేడు మంత్రి

తుమ్మల పర్యటన

ములకలపల్లి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో శుక్రవారం పర్యటించునున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలుపడింది. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వపై సూసర్‌ పాసేజ్‌ పిల్లర్‌ కూలిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలంమ తొట్టిపంపు గ్రామంలో ప్యాకేజ్‌–9 వద్ద జరుగుతున్న పనుల పురోగతి, ఆ తర్వాత యాతాలకుంట వద్ద చేపడుతున్న టన్నెల్‌ పనులను తుమ్మల పరిశీలించనున్నారు. యాతాలకుంట క్యాంప్‌ వద్ద ‘సీతారామ’ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కాగా, సీతా రామ ప్రధాన కాలువ గైడ్‌వాల్‌కు రెండు చోట్ల పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తారా లేదా అనే విషయమై ఎలాంటి సమాచారం లేదు.

ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

కొత్తగూడెంటౌన్‌: జూన్‌ 14న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్‌ సూచించారు. తన చాంబర్‌లో గురువారం కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

నేటి నుంచి

రెమిడియల్‌ టీచింగ్‌

కొత్తగూడెంఅర్బన్‌: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు శుక్రవారం నుంచి రెమిడియల్‌(లోప నివారణ) బోధన ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల వారీగా ఏ సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.. వారికి బోధనకు ఏ ఉపాధ్యాయుడిని కేటాయించామో తెలిపేందుకు గూగుల్‌ షీట్‌ను తయారు చేసి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించామని పేర్కొన్నారు. టీచర్ల వివరాలు గూగుల్‌ షీట్‌లో నమోదు చేయని ప్రధానోపాధ్యాయలపై చర్యలు తీసుకునేలా విద్యాశాఖ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కాగా, ఆయ ప్రధానోపాధ్యాయులు కూడా రెమిడియల్‌ టీచింగ్‌కు సరైన టైమ్‌ టేబుల్‌ రూపొందించుకోవాలని, వేసవి దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఆరు నెలల పాటు

సమ్మె నిషేధం

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఆరు నెల ల పాటు సమ్మె నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా.. సింగరేణి యాజమాన్యం గురువారం రాత్రి ఇదే విషయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని అత్యవసర సర్వీసుల మెయింటెనెన్స్‌ యాక్ట్‌ 1971 (1971 కంపెనీ యాక్ట్‌–20) సెక్షన్‌లోని సబ్‌– సెక్షన్‌,(1), (3) కిందకు సింగరేణి సంస్థ వస్తున్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆరు నెలల పాటు సమ్మె నిషేధమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement