
సాగునీటి వనరులకు మహర్దశ
● మరమ్మతులకు రూ.4.78 కోట్ల నిధులు మంజూరు ● 4,294 ఎకరాల ఆయకట్టుకు తీరనున్న ఇక్కట్లు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయానికి, భూగర్భజలాల పెరుగుదలకు ఆధారమైన సాగునీటి వనరులకు మహర్దశ పట్టనుంది. గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలు, పెదవాగు వరద కారణంగా దెబ్బతిన్న సాగునీటి వనరుల అభివృద్ధికి మోక్షం లభించింది. చెరువులు, చెక్డ్యామ్లు, పంట కాలువలు తదితర సాగునీటి వనరుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
‘ఇందిరమ్మ చెరువు బాట’తో పనులు
అశ్వారావుపేట మండలంలో 152 చెరువులు, 18 చెక్డ్యామ్లు, దమ్మపేట మండలంలో 274 చెరువులు, 8 చెక్ డ్యామ్లు ఉన్నాయి. వీటిలో అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెంలో నర్సింహాసాగర్ చెరువు, మద్దికొండ గ్రామంలోని కొడిశెలవాగు చెరువు, మొద్దులమడ చెరువు, నందిపాడు గ్రామంలోని చెక్డ్యామ్, ఖమ్మంపాడు గ్రామంలోని పరికల వాగుపై కొత్తగా చెక్డ్యామ్ నిర్మాణం, అనంతారం గ్రామంలోని పెదవాగుపై ఉన్న చెక్డ్యామ్, నారాయణఫురంలోని పెదవాగు చెక్డ్యామ్, కొత్త మామిళ్లవారిగూడెం గ్రామంలోని చింతల చెరువు, కొత్త కావడిగుండ్ల గ్రామంలోని అల్లులాకుల కుంటతోపాటు గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం 9 పనులకు రూ.2.53 కోట్లు మంజూరయ్యాయి. దమ్మపేట మండలంలో 8 పనులకు రూ.25 లక్షలు కేటాయించారు. కొద్ది రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ‘ఇందిరమ్మ చెరువు బాట’పేరుతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకొని సాగునీటి వనరులు అభివృద్ధి కానుండగా, అశ్వారావుపేట మండలంలో 3,694 ఎకరాలు, దమ్మపేట మండలంలో 600 ఎకరాల ఆయకట్టుకు లబ్ధిచేకూరనుంది. అయితే పనులు వచ్చే వానాకాలం సీజన్ నాటికి పూర్తి చేయాలని, లేకపోతే పొలాలకు సాగునీరు అందదని రైతులు పేర్కొంటున్నారు.
చెక్డ్యామ్కు అటవీశాఖ అడ్డంకులు
ఎమ్మెల్యే చొరవతో సాగునీటి వనరుల మరమ్మతులకు నిధులతోపాటు నాబార్డు ద్వారా కొత్తగా అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామంలోని పరికల వాగుపై చెక్డ్యామ్ మంజూరైంది. చెక్డ్యామ్కు సుమారు రూ.2 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అటవీ శాఖ అభ్యంతరాలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేశారు. చెక్డ్యామ్ నిర్మాణం పూర్తయితే 80 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మొత్తంగా రెండు మండలాల్లో కలిపి రూ.4.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
జూన్ 15నాటికి పనులు పూర్తి చేస్తాం
ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి చెరువులు, చెక్డ్యామ్, పంట కాలువ మరమ్మతులు పూర్తి చేస్తాం. అధిక వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, పంట కాలువలు, చెక్డ్యామ్లకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం.
– కోటగిరి సురేష్, ఈఈ,
నీటిపారుదల శాఖ

సాగునీటి వనరులకు మహర్దశ

సాగునీటి వనరులకు మహర్దశ