
వాహన రిజిస్ట్రేషన్ దూరం..భారం
మణుగూరు రూరల్: సింగరేణి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న మణుగూరులో క్రమంగా వాహనాల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. కానీ వాహన రిజస్ట్రేషన్లు చేయించుకోవాలంటే భద్రాచలం వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీంతో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రెవెన్యూ శాఖ స్థలం కూడా కేటాయించింది. దీంతో అధికారులు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆర్టీఓ శాఖ కార్యాలయం ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించినా రవాణా శాఖ కార్యాలయానికి నిధులు మంజూరు చేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం పినపాక నియోజకవర్గ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాహన రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
మణుగూరులో ప్రకటనలకే పరిమితమైన రవాణాశాఖ కార్యాలయ ఏర్పాటు