
వణుకు పుట్టిస్తున్న చినుకు..
పుట్పాత్ల ఆక్రమణ,
డ్రెయినేజీ అస్తవ్యస్తం
రాష్ట్ర విభజన అనంతరం ఐదు పంచాయతీలు ఏపీలో కలవడంతో భద్రాచలంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసాలు పెరిగాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలతో పాటుగా డ్రెయినేజీలను ఆక్రమించి మరీ నిర్మాణాలను చేపట్టారు. దీంతో పాటుగా వ్యాపార సముదాయాలు సైతం ఫుట్పాత్ల మీదుగా వెలిశాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన డ్రెయినేజీ వ్యవస్థను సైతం అధికారులు పక్కదారి పట్టించారు. సిటీ మాస్టర్ ప్లాన్ సైతం లేకపోవడంతో ఇష్ణానురీతిగా నిర్మాణాలు సాగాయి. దీంతో పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
భద్రాచలం: రానున్నది వర్షాకాలం.. భద్రాచలం ప్రజలను ఒక వైపు గోదావరి వరదలు భయపెడుతుంటే, మరోవైపు చిన్నపాటి చినుకులు సైతం వణికిస్తుంటాయి. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి వచ్చిన వర్షపు నీరు వరదను తలిపిస్తోంది. దీంతో గోదావరినే రోడ్లపైకి వచ్చిందా అన్నట్లుంటుంది భద్రాచలంలో పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు హామిలిస్తున్నా.. అవి కార్యరూపం దాల్చటం లేదు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తుగా మేల్కొనాలని భద్రాచలం వాసులు వేడుకుంటున్నారు.
అత్యాధునిక డ్రెయినేజీ సిస్టం అత్యవసరం
భద్రాచలంలో కొద్ది పాటి వర్షం కురిసినా రోడ్ల మీద వరద పారుతోంది. చర్ల రోడ్డు, ఉదయ్భాస్కర్ రోడ్డు, మిథిలా స్టేడియంతో పాటు ప్రధాన రోడ్లన్నీ ఇలాగే దర్శనమిస్తున్నాయి. శివారు కాలనీలు, చెరువు సమీప ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుతోంది. రాత్రి సమయంలో వర్షం కురిస్తే ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కారణం ఇంతవరకు సిటీ మాస్టర్ ప్లాన్ లేకపోవడ, అధికారులు ఆ దిశగా కసరత్తు చేయకపోవడమే. భద్రాచలం జనాభా సుమారు లక్ష. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులతో పాటు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పటిష్ట, అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థను రూపొందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చొరవ చూపాలి..
గోదావరి వరద సంభవించినప్పుడు స్లూయిజ్లు మూసివేడయంతో వర్షపు నీరు గోదావరిలో కలవడం లేదు. దీంతో ఆలయ సమీపంలో ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రంలోకే కాకుండా ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ వరద చేరుతోంది. దీనిని తోడేందుకు భారీ మోటార్లను ఏటా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కాకుండా శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిదులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..
భద్రాచలంలో వర్షం కురిస్తే ప్రధాన రోడ్లు, శివారు కాలనీలు జలమయమవుతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. స్లూయిజ్ల వద్ద వర్షపు నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలి.
–రావులపల్లి రాంప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు
అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారిస్తేనే ఫలితం..
భద్రాచలంలో డ్రెయినేజీ అస్తవ్యస్తం..
చినుకు పడితే రోడ్లపై పారుతున్న వరద
అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థ
ఏర్పాటు చేయాలనే డిమాండ్

వణుకు పుట్టిస్తున్న చినుకు..