
అమ్మాయిలదే హవా..
‘పది’లో ప్రతిభ కనబర్చిన బాలికలు
● జిల్లాలో 91.49 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో 27వ స్థానంలో ‘భద్రాద్రి’ ● ఈనెల 16 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించే అవకాశం
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. బుధవారం విడుదలైన ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 27వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 1.10 శాతం ఉత్తీర్ణత పెరిగినా.. రాష్ట్ర స్థాయిలో ఒక స్థానం కిందకు పడిపోయింది. జిల్లాలో ఈ ఏడా ది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మొత్తం 12, 250 మంది పరీక్షలు రాయగా, 11,208 (91.49 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 5,971 మందికి 5,320, బాలికలు 6,279 మందికి 5,888 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 4.67 శాతం అధిక ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది జిల్లాలో 299 పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 78 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో ప్రభుత్వ పాఠశాలు 54, ప్రైవేట్ పాఠశాలలు 24 ఉన్నాయి. ఇక విద్యారులంతా ఫెయిలైన పాఠశాలలు ఏమీ లేవు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నా.. రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు రావడం లేదని, దీనిపై విద్యాశాఖాధికారులు సమీక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా వారంతా అందుబాటులో ఉంటారని, ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అంటున్నా రు. కాగా, ఉత్తీర్ణత కాలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమై ఉత్తీర్ణత సాధించాలని విద్యాధికారులు సూచిస్తున్నారు.
15 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్..
పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటే తక్కువ వచ్చిన వారు, పరీక్షలు బాగా రాశామనుకుంటే ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈనెల 15 వరకు అవకాశం ఇచ్చారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుం లేకుండా 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
‘ఆశ్రమాల్లో’ పెరిగిన ఫలితాలు
భద్రాచలం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పదో తరగతి ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది కంటే కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఆశ్రమ పాఠశాలల్లో 93.77, హాస్టళ్లలో 84.34 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మొత్తం 2,173 మందికి 2,022 మంది ఉత్తీర్ణత సాధించగా 151 మంది ఫెయిలయ్యారు. గతేడాది 90.60 శాతం ఫలితాలు సాధించగా ఈ ఏడాది 93.05 శాతానికి పెరిగింది. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 31 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారని పీఓ రాహుల్ తెలిపా రు. ఇల్లెందు ఆశ్రమ పాఠశాలలో అతి తక్కువగా 65.22 శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.