భూ భారతితో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యల పరిష్కారం

Apr 30 2025 12:16 AM | Updated on Apr 30 2025 12:16 AM

భూ భారతితో సమస్యల పరిష్కారం

భూ భారతితో సమస్యల పరిష్కారం

● కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వెల్లడి ● బూర్గంపాడు, భద్రాచలంలో ఎమ్మెల్యేలతో కలిసి సదస్సులు

బూర్గంపాడు/భద్రాచలంటౌన్‌ : భూముల సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఈ చట్టంపై బూర్గంపాడు, భద్రాచలంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా భూముల హక్కులు, రికార్డులు భద్రంగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రికార్డుల్లో సవరణలు, మ్యుటేషన్‌, వారసత్వ హక్కులు, సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంతో గిరిజన, గిరిజనేతరుల భూములకు కూడా భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని, ఈ చట్టంతో షెడ్యూల్‌ (ఏ )ను ఏర్పాటు చేసి భూమి విలువ రూ.5 లక్షల లోపుంటే ఆర్డీఓ స్థాయిలో, అంతకు ఎక్కువుంటే కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందని వివరించారు. కలెక్టర్‌ స్థాయిలో కూడా పరిష్కారం కాకుంటే సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ శాఖను చిన్నాభిన్నం చేసిందని, రైతుల భూములకు భద్రత కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత గిరిజన రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరభ్‌ శర్మ, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్లు ముజాహిద్‌, శ్రీనివాసరావు, బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement