
జూద క్రీడలు ఆడితే చర్యలు
ఎస్పీ రోహిత్రాజు
దమ్మపేట: కోడి పందేలు, పేకాట, బెట్టింగ్ వంటి జూద క్రీడలు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం ఆయన దమ్మపేట పోలీసు స్టేషన్ను సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై నిఘా పెట్టాలన్నారు. అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి పాల్గొన్నారు.
చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష
భద్రాచలంఅర్బన్: బైక్ చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సోమవారం భద్రాచలం ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి శివనాయక్ తీర్పు చెప్పారు. దుమ్ముగూడేనికి చెందిన మట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్ సెప్టెంబర్ 4, 2022లో భద్రాచలంలో చోరీకి గురైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులు కారం కృష్ణమూర్తి, కేదాసి రాములుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీగా శ్రీనివాస్ వాదించగా, సీఐ నాగరాజు రెడ్డి, నరసింహా సహకరించారు.