
‘భూ భారతి’తో వివాదాలకు చెక్
● అర్హులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు ● సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చండ్రుగొండ : భూ భారతి చట్టంతో భూ వివాదాలకు ఇక పుల్స్టాప్ పడనుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని అయన్నపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రెవెన్యూశాఖలో పూర్తిస్థాయిలో యంత్రాంగం ఉంటేనే పనులు జరుగుతాయని, ఆ దిశగా వ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంతో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని, భూమికి నక్షాతో కూడిన పాస్బుక్లు వస్తాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందన్నారు. కుటుంబాల్లో సైతం ఏర్పడే భూ వివాదాలకు ఇక ఆస్కారం ఉండబోదన్నారు. భూ వివాదాల్లో గతంలో కోర్టును ఆశ్రయించేవారని ఇకపై ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి రికార్డులు సృష్టించుకుంటే విచారించి రద్దు చేసే అధికారం భూభారతి చట్టం ద్వార రెవెన్యూ అధికారులకు లభించిందన్నారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం గ్రామంలో మునగతోటను కలెక్టర్ పరిశీలించారు. రైతు చాపలమడుగు నాగేందర్తో మాట్లాడి సేద్యం చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకుని అభినందించారు. మునగ, ఆయిల్పామ్ సేద్యం వైపు రైతులు ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ మధు, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏఓ వినయ్, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు పాల్గొన్నారు.