
చేపల వలకు చిక్కిన మొసలి కళేబరం
అశ్వాపురం: మండలంలోని తుమ్మలచెరువులో గురువారం చేపలు పడుతుండగా వలలో మొసలి పిల్ల చిక్కింది. అది కూడా చనిపోయి ఉండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఎఫ్ఆర్ఓ రమేశ్, సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో ఖననం చేశారు.
ఏడుగురిపై కేసు నమోదు
బూర్గంపాడు: పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ మండల అధ్యక్షులు బీరక సాయిశ్రీనివాస్, గుణపాటి వెంకటరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులపై గురువారం బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. జింకలగూడెం గ్రామం వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన బీరక సాయిశ్రీనివాస్, గుణపాటి వెంకటరెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్ లక్ము, ఇస్మాయిల్, నాగుల్మీరా, చాంద్బీ, హుస్సేన్, నాగుల్మీరా, ఎండీ మోహిన్ దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. సాయిశ్రీనివాస్ తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
గుండాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. జూలూరుపాడుకు చెందిన కళ్లెం సాయిచరణ్ కొంతకాలంగా ఆళ్లపల్లి మండలం అనంతోగులో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో జిన్నెలగూడెంలో వివాహానికి హాజరై వస్తున్న క్రమంలో రాయికి గుద్దుకుని బైక్ పల్టీకొట్టింది. గాయపడిన సాయిచరణ్ను స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.