
ఖమ్మం మార్కెట్లో డీడీఎం పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల కొనుగోళ్లను మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి బుధవారం పరిశీలించారు. మిర్చి జెండా పాట, ధర ఖరారుపై రైతులతో మాట్లాడిన ఆమె సమస్యలపై ఆరా తీశారు. అలాగే, కాంటాల తీరును కూడా తనిఖీ చేశారు. అనంతరం మార్కెట్లో రూ.155.35 కోట్లతో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతేకాక సీసీఐ పత్తి కొనుగోళ్లలో వచ్చిన ఆరోపణలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. తాతాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్)కు సంబంధించి ఎన్ని పుస్తకాలు ముద్రించారు, ఎవరెవరికి జారీ చేశారనే అంశాలు ఆరా తీసినట్లు తెలిసింది. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, గ్రేడ్–2 కార్యదర్శి సృజన్ బాబు, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు.