ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామనవమి సందర్భంగా దేశం నలుమూల నుంచి జిల్లాకు వచ్చే భక్తులకు ఈసారి కూడా బస, వసతి కోసం ఇక్కట్లు తప్పేలా లేవు. భద్రాచలంలో గదులు దొరకని భక్తులు పాల్వంచ, కొత్తగూడెంలో కూడా వసతి కోసం వాకబు చేస్తారు. ఈ రెండు పట్టణాల్లో నిర్మిస్తున్న హరిత హోటల్, కిన్నెరసాని కాటేజీలు ప్రారంభిస్తే కనీసం వంద గదులు భక్తులకు అందుబాటులోకి వస్తాయి.
ముగ్గురు మంత్రులు వచ్చినా..
కిన్నెరసాని డ్యామ్ వద్ద ఏళ్ల తరబడి నిర్మాణ పనులు సాగుతున్న అద్దాల మేడ, రివర్వ్యూ కాటేజీలతో పాటు ఇల్లెందు క్రాస్రోడ్ దగ్గర 56 గదులతో నిర్మిస్తున్న హరిత హోటల్ పనులను గతేడాది ఆగస్టులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు గంటలకు పైగా పరిశీలించారు. వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీకి కిన్నెరసాని అభివృద్ధి పనుల ప్రణాళిక రూపొందించే పనిని అప్పగిస్తామన్నారు. ఈ పనులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్, అటవీ, విద్యుత్, పర్యాటకంతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తామని చెప్పారు. మూడు నెలల్లో కాటేజీలు, హరిత హోటల్ అందుబాటులోకి తెస్తామన్నారు. వారు నిర్దేశించిన గడువు దాటి.. మరో మూడు నెలలు కావస్తున్నా ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు.
కానరాని కన్సల్టెంట్లు..
2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక గతేడాది ఆగస్టు 12న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. డ్యామ్ మధ్యలో ఉన్న ఆనందద్వీపం వద్ద ఎకో టూరిజంలో భాగంగా చేపట్టబోయే పనులకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమిస్తామని ప్రకటించారు. ఇక తొమ్మిదేళ్లుగా నిర్మాణం జరుపుకుంటూనే ఉన్న అద్దాల మేడ, రివర్ వ్యూ కాటేజీలను 2024 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
సా..గుతూనే ఉన్నాయి..
భద్రాచలం వచ్చే రామభక్తులతో పాటు పారిశ్రమిక ప్రాంతాలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరుకు అనుకూలంగా ఉండేలా ఇల్లెందు క్రాస్రోడ్ దగ్గర హరిత హోటల్, కాటేజీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులు ఏడున్నరేళ్ల కిత్రం ప్రారంభించారు. రూ.15 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు నాలుగేళ్ల కిందటే పూర్తయ్యాయి. కేవలం విద్యుత్ కనెక్షన్, సీలింగ్, డెకరేషన్, ఫర్నిచర్, ఏసీల ఏర్పాటు పనులే మిగిలాయి. ఇలా ఐదేళ్లు దాటినా ఇప్పటికీ ఈ హోటల్ అందుబాటులోకి రాలేదు. గతేడాది ఏప్రిల్లో హరిత హోటల్లో ఈ పనులు మొదలుపెట్టారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేసి హోటల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
న్యూస్రీల్
భక్తులకు సరిపడా లేని
వసతి సౌకర్యాలు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్, కాటేజీల నిర్మాణం
పదేళ్ల క్రితమే పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తికాని వైనం
గత ఆగస్టులో మంత్రుల పరిశీలన, మూడు నెలల గడువు
డెడ్లైన్ ముగిసినా కొనసాగుతూనే ఉన్న పనులు
నవమికి అందుబాటులోకి తెస్తాం
ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్ను శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఎలక్ట్రికల్తో పాటు ఇతర పనులను వేగంగా నిర్వహిస్తున్నాం. కిన్నెరసాని దగ్గరున్న అద్దాల మేడ, కాటేజీలు పూర్తయ్యాయి. వాటిని ఎకో టూరిజం విభాగానికి అప్పగించేందుకు ప్రతిపాదనలు పంపాం. వారు హ్యాండోవర్ చేసుకుని, వినియోగంలోకి తేవాల్సి ఉంది.
–రామకృష్ణ, టూరిజం శాఖ డీఈ
ఈ నవమికీ ఇక్కట్లేనా..?