సింగరేణి సీఎండీని కలిసిన ఎమ్మెల్యే
సత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని ఓసీల నుంచి బొగ్గు రవాణాకు ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యాన స్పందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. ఈమేరకు హైదరాబాద్లో సింగరేణి సీఎండీ బలరాంను శనివారం కలిసిన ఆమె సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు, కిష్టారం వాసుల దీక్షలపై వివరించారు. కాలుష్య ప్రభావంతో పలువురు మృతి చెందగా, బాంబ్ పేలుళ్లులో ఇళ్లు దెబ్బతిన్నందున బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య వినతితో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సింగరేణి ఓసీలు, సైలోబంకర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను శనివారం శాసన మండలిలో ప్రస్తావించారు.
రేపటి నుంచి స్పోర్ట్స్ స్కూళ్ల ప్రవేశాలకు ఎంపిక పోటీలు
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని బాలుర, గుండాల మండలం కాచనపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సోమవారం డివిజన్స్థాయి ఎంపికలు నిర్వహించనున్నామని ఐటీడీఏ స్పోర్ట్స్ అధికారి గోపాల్రావు శనివారం తెలిపారు. దమ్మపేట డివిజన్ పరిధిలోని అంకంపాలెంలో 17న, కమలాపురంలో 18న, భద్రాచలం డివిజన్లోని గొందిగూడెంలో 17న, ఆర్గగూడెంలో 18న, ఇల్లెందు డివిజన్ పరిధిలోని కాచనపల్లిలో 17న, బొజ్జాయిగూడెంలో 18వ తేదీన బ్యాటరీ టెస్ట్లు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికలకు వచ్చే విద్యార్థులు తమ వెంట స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, రెండు పాస్ఫొటోలు, టీషర్ట్, షార్టులు తెచ్చుకోవాలని సూచించారు.
108లో గర్భిణి ప్రసవం
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ రూరల్ : ఓ గర్భిణి 108 అంబులెన్స్లో ప్రసవించి, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. పాల్వంచ మండలం జగ్గుతండాకు చెందిన జ్యోతి రామవరంలోని ఎంసీహెచ్లో ఇటీవల చేరింది. రక్తహీనత, అధిక రక్తపోటు కారణంతో వైద్యులు వరంగల్ ఎంజీఎంకు రిఫర్ చేయగా శనివారం చుంచుపల్లి 108 సిబ్బంది వరంగల్ తరలిస్తున్నారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై అంబులెన్స్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వారిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు 108 సిబ్బంది, ఈఎంటీ స్నేహ, పైలట్ హరిశంకర్ తెలిపారు.
ఇల్లెందు కోర్టు ఏజీపీగా అరుణ
ఇల్లెందు: ఇల్లెందు కోర్టు ఏజీపీగా వి.అరుణను నియమించారు. 24 ఏళ్లుగా ఇల్లెందు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. దీంతో ఆమెను ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా ప్రభుత్వం నియమించింది. తన నియామక ఆర్డర్ కాపీని కోర్టు న్యాయమూర్తికి అందజేసినట్లు అరుణ వెల్లడించారు. ఆమె వెంట సీనియర్ న్యాయవాదులు చెన్నకేశవరావు, బార్ అధ్యక్షుడు బి.రవికుమార్ ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇల్లెందు: పట్టణంలోని 17వ వార్డులో ఓ వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ అబ్దుల్ అజీజ్ (40) ఇంట్లో మృతిచెంది ఉండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా పడిఉన్నాడు. భార్య దూరంగా ఉండటంతో కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట డ్యూటీకి వెళ్లి వచ్చి మద్యం మత్తులో డీహైడ్రేషన్కు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ బి.సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి
యువకుడు మృతి
దమ్మపేట: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని గండుగులపల్లి శివారులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పొడియం సందీప్ (24) తన ఇద్దరు స్నేహితులు ఊకే రాజు, పొడియం బాబూరావుతో కలిసి బైక్పై శుక్రవారం రాత్రి సత్తుపల్లి మండలం బుగ్గపాడులో జరుగుతున్న జాతరకు వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బైక్ను సందీప్ అతివేగం, నిర్లక్ష్యంతో నడుపుతుండగా గండుగులపల్లి శివారులో అదుపుతప్పి కిందపడింది. సందీప్, రాజుకు తీవ్రగాయాలు కాగా.. బాబూరావుకు స్వల్పగాయాలయ్యాయి. ఈ క్రమంలో బాబూరావు మిగతా ఇద్దరిని 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. సందీప్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.
సైలో బంకర్ సమస్య పరిష్కరించండి