అభివృద్ధిలో ముందుంచుతాం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ముందుంచుతాం

Mar 10 2025 12:29 AM | Updated on Mar 10 2025 12:28 AM

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకుపోతోందని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆదివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్‌, రామసహాయం రఘురాంరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగు, సాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలబెట్టేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై విస్తృతంగా చర్చించామన్నారు. జిల్లాలో అత్యవసర అభివృద్ధి పనులకు మినరల్‌ ఫండ్‌, జిల్లా అభివృద్ధి నిధులు, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నిధులను వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. హ్యామ్‌ రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. సమావేశంలో పినపాక, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్‌, మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య పాల్గొన్నారు.

అత్యవసర పనులకు మినరల్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఫండ్‌ వినియోగించుకోండి

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement