
మహిళా ఉత్పత్తులకు హైదరాబాద్లో విశేష ఆదరణ
కొత్తగూడెం అర్బన్/చుంచుపల్లి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆలోచన మేరకు, ‘ఎక్స్ ప్లోర్ భద్రాద్రి కొత్తగూడెం’కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జి సిటీలో ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘రన్ ఫర్ హర్’అనే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ నిర్వహించగా సుమారు 1,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు స్వయంగా తయారు చేసిన కరక్కాయ టీపౌడర్, తేనే, ఫ్లేవర్ తేనే, విప్పపూలు, విప్పనూనె, మిల్లెట్స్తో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్, గిరి ప్రొడక్ట్స్ అయిన సబ్బులు, న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ వంటి వివిధ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్రదర్శించారు. ఈవెంట్లో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, వివిధ రంగాల్లో ఉన్న మహిళలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీపీఎం నాగజ్యోతి, ఏపీఎం వెంకయ్య తదితరులు పాల్గొని మహిళల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించారు.