ముద్రగడ సేవలు అజరామరం | - | Sakshi
Sakshi News home page

ముద్రగడ సేవలు అజరామరం

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

కాపు జాతి సంక్షేమానికి ఎంతో కృషి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

రేపల్లె: రాజకీయాలకతీతంగా అందరూ అభిమానించే మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. కాపు నాయకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాపు సమాజానికి రాజకీయ రిజర్వేషన్‌ సాధించేందుకు ముద్రగడ పద్మనాభం సాగించిన వీరోచిత పోరాటాలను అంబటి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కంటే కాపు జాతి అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చి అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. కాపుల హక్కుల కోసం చేసిన ఉద్యమాల్లో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని పట్టుదలతో విక్రమార్కుడిలా ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందన్నారు. అలాంటి మహానుభావుడు కాపు జాతిలో పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం లేకపోవడం బాధాకరమని, ఆయనను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. కాపు జాతి ఐక్యత కోసం ఆయన అనేక ఉద్యమాలను విజయవంతంగా నడిపించారని పేర్కొన్నారు. ఆయన నీతి, నిజాయతీ, పట్టుదలే ఆయన విజయానికి సోపానాలని కొనియాడారు. ముద్రగడ పద్మనాభం ప్రజాసేవ అపారమైనదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చూపిన నిబద్ధత అరుదైనదన్నారు. కాపు జాతి ఐక్యత కోసం ఆయన నడిపిన ఉద్యమాలు సమాజంలో చైతన్యం నింపాయన్నారు. పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి గానీ, ఆయన ఎప్పుడూ పదవుల కోసం విలువలను వదల్లేదన్నారు. నీతి, నిజాయితీ, అచంచలమైన పట్టుదల ఈ మూడు గుణాలే ఆయనను విశిష్ట నాయకుడిగా నిలబెట్టాయని, ఆయన జీవితం ప్రతి నాయకుడికి ఆదర్శమని కొనియాడారు. ఆగస్ట్‌ 1వ తేదీన కిర్లంపూడిలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగే సంతాపసభకు అందరూ హాజరై ఆయన సేవలను స్మరించుకోవాలని కోరారు. పలువురు పద్మనాభం సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, న్యాయవాది రజని, పలు పార్టీల నాయకులు చందు సాంబశివరావు, గూడపాటి శ్రీనివాసరావు, గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, కమతం సాంబశివరావు, చదలవాడ శ్రీనివాసరావు, తోట రాంబాబు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement