కర్లపాలెం: శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. నవమిని పురస్కరించుకుని గ్రామాలలో గల రామాలయాల వద్ద సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చలువ పందిళ్లు వేసి ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. చలువ పందిళ్లకు పలు రంగుల కాగితాలు, మామిడి తోరణాలు, అరటి చెట్లను అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు, స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
బాపట్ల టౌన్: పట్టణంలోని రామాలయాల వద్ద శుక్రవారం నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఆయా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు గురువారం ఏర్పాట్లను పూర్తిచేశారు. రామాలయాలను నూతన రంగులతో అలంకరించి కల్యాణం జరిగే ప్రాంతాలలో చలువ పందిళ్లను ఏర్పాటుచేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల్లో నిమఘ్నమయ్యారు. పట్టణంలోని రథం బజార్ సెంటర్లో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీస్థాయిలో చలువ పందిరి ఏర్పాటుచేశారు. ఇక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నద్ధమయ్యారు. భీమావారిపాలెం, బెస్తపాలెం, చీలురోడ్డు, కాకుమానువారిపాలెం, మార్కెట్ సెంటర్, మున్నంవారిపాలెం, చీలురోడ్డు, ఉప్పరపాలెంలోని రామాలయాల వద్ద ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మండలంలోని ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, అప్పికట్ల, కంకటపాలెం, పాండురంగాపురం, మరుప్రోలువారిపాలెం, పోతురాజుకొత్తపాలెం, దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి, పిన్నిబోయినవారిపాలెం గ్రామాల్లో సీతారాముల కల్యాణం కనులపండువగా జరుగనుంది.


