18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్గా నమోదు కావాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం పట్టణంలో భారీ ర్యాలీ
బాపట్ల: ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలో ర్యాలీ జరిపారు. వై జంక్షన్ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ అగ్రభాగాన నిలిచి యువతను ప్రోత్సహించారు. ‘నా దేశం–నా ఓటు అంటూ’ యువత పెద్ద పెట్టున నినదించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని పేర్కొన్నారు. ఓటు ద్వారా మంచి నాయకుడు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చన్నారు. తద్వారా మంచి సమాజం నిర్మాణంలో మనం భాగస్వాములు కావచ్చన్నారు. దేశానికి యువత వెన్నుముకలాంటి వారన్నారు. యువతీ యువకులంతా తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని సూచించారు. ఓటు ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి అనే విషయాలపై నా తల్లిదండ్రులు నాకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించే వారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కాగానే, చివరి పరీక్ష రాసిన వెంటనే పరీక్ష కేంద్రం నుంచి నేరుగా యూనిఫాంలోనే వెళ్లి ఓటు హక్కు కోసం నా పేరు నమోదు చేయించుకున్నానని కలెక్టర్ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అలాగే మీరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోడానికి 18 ఏళ్ల నిండగానే మీ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కుపై యువత అవగాహన పొందాలన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాలలో సామాజిక సేవలు అందించే వారికి గణతంత్ర దినోత్సవంలో బాపట్ల పురస్కారం అవార్డు అందజేస్తామని తెలిపారు. సోమవారం పోలీస్ కవాతు మైదానంలో జరిగే 77వ గణతంత్ర దినోత్సవానికి జిల్లా ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. అనంతరం ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన రెవెన్యూ అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు నగదుతోపాటుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఆర్డీఓ పి గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ ప్రజలు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


