రైతు నెత్తిన ఎరువు దరువు
● ఎమ్మార్పీ కంటే అధికంగా
వ్యాపారుల విక్రయం
● వ్యవసాయానికి భారీగా
పెరిగిన పెట్టుబడులు
సత్తెనపల్లి: చంద్రబాబు పాలనలో ఎరువుల, ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో రైతుల పై మోయలేని భారం పడుతోంది. పెట్టుబడి సాయం అంతంతమాత్రంగానే ఉండటం, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలవుతున్నారు. గత ఏడాది సాగు చేసిన వరి, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది పంట ఉత్పత్తులు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు దోచుకుంటున్నారు.
మద్దతు ధర రాక నష్టాల బాట..
జిల్లా వ్యాప్తంగా 2,76,947 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలున్నాయి. గత ఏడాది వరికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు నష్టాలు బాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి దళారులకు తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎకరా పంట సాగు చేయడానికి పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల పైనే ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. మోంథా తుఫాన్తో పత్తి పంట తడిచి నల్లగా మారింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
నాడు అందుబాటులో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో 2019–2024 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. అంతే కాకుండా డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా వంటి వాటికి కృత్రిమ కొరత సృష్టించి సక్రమంగా రైతులకు అందించలేని దుస్థితిలో చంద్ర బాబు సర్కార్ ఉంది.


