
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వాములు కావాలి
నరసరావుపేటరూరల్: ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనాలు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు.