బాపట్ల: జిల్లాలోని ఎస్టీల సమస్యలపై ప్రతి నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అందులో భాగంగా ఉదయం 10.30గంటల నుంచి కలెక్టరేట్ సముదాయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్టీలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఏఎంఆర్ కంటైనర్ ధ్వంసం
బల్లికురవ: గ్రానైట్, మెటల్, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ కంటైనర్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం పగులగొట్టి ధ్వంసం చేశారు. అక్టోబర్ 1 నుంచి అక్రమ రవాణాకు అడ్డుకట్టతో సీనరేజ్ వసూలు బాధ్యతలను ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ నెలకు రూ.47 కోట్లు రాయల్టీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల లోని ప్రధాన గ్రామాల్లో కంటైనర్లను తెచ్చి ఇప్పటికే అమర్చారు. అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న వారంతా కంటైనర్ల ఏర్పాటుతో హడలెతుత్తుతున్నారు. ధర్మవరం కొండ సమీపంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు.
జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అవగాహన పెంచాలి
బాపట్ల: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై వ్యాపారస్తులు ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాలని తూనికలు కొలతల శాఖ రీజినల్ ఆఫీసర్ ఐజాక్ పేర్కొన్నారు. బాపట్ల రిటైల్ కిరణా అండ్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో గురువారం వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0లో భాగంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో బాపట్ల జిల్లా అధికారి లిల్లీ, ఇన్స్పెక్టర్ రామదాసు పాల్గొన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
బాపట్ల టౌన్: భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 112 (లేదా) 8333813228కి ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే 26 పునరావాస కేంద్రాలను కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వాటిల్లో రక్షణ పొందాలని ఆయన సూచించారు.
రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్న్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు.