
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు
బాపట్ల టౌన్/చీరాల అర్బన్: పేదల వైద్యసేవలు అందించే మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయటం సరికాదని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున తెలిపారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు శుక్రవారం బాపట్ల జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బాపట్లలోని మెడికల్ కళాశాల వరకు నిర్వహించారు. పేదలకు వైద్యసేవలు అందించే మెడికల్ కళాశాలలను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం సరికాదని మేరుగ పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఏ స్థాయిలో ఉద్యమించడానికై నా వెనుకాడేది లేదన్నారు.
ప్రైవేటుపరం చేస్తే సహించం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి శుక్రవారం బాపట్లలోని మెడికల్ కాలేజీ భవనం వద్దకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్బాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయం దారుణమన్నారు. అలా చేస్తే సామాన్యులకు వైద్యం, పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే ఫీజులు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు.. ప్రైవేటుపరం అయితే రూ.లక్షల్లోకి వెళతాయన్నారు. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదన్నారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిధుల లేమి సాకుతో ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాపట్లకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, వేటపాలెం మండల అధ్యక్షులు సాధు రాఘవ, మాజీ అధ్యక్షులు బి.సుబ్బారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబూరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్, మహిళా నాయకురాలు ప్రసన్న, జిల్లా మున్సిపల్ వింగ్ సభ్యులు కంచర్ల చక్రవర్తి, కౌన్సిలర్లు కీర్తి వెంకటరావు, కంపా అరుణ్, మాజీ కౌన్సిలర్ చెల్లి బాబూరావు, పార్టీ నాయకులు ఎస్.నవీన్, పోతురాజు, జంగా ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున