
సక్రమంగా పొగాకు కొనుగోలు
జిల్లా కలెక్టర్ ఆదేశం
బాపట్ల టౌన్: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. తొలుత బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేకపోతే పొరుగు జిల్లాలకు సరుకు పంపాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉందన్నారు. మార్క్ఫెడ్ ఏడీ కరుణశ్రీ,, ఆర్డీవో పి.గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరూ తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.
విశ్వకర్మ సిద్ధాంతాలు పాటించాలి
ప్రతి ఒక్కరూ విశ్వకర్మ సిద్ధాంతాలను పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో కలిసి నిర్వహించారు. ఇన్చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, రేపల్లె సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి.శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇ–ఆఫీస్ ఫైల్స్ అమలుకు ఆదేశం
ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఇ–ఆఫీస్ ఫైల్స్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారదర్శకత కోసం ప్రతి దస్త్రాన్ని ఆన్లైన్లో ఉంచాలన్నారు. డ్వామా కార్యాలయంలో అత్యధికంగా దస్త్రాలు టేబుల్స్పైనే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిపడా యూరియా పంపిణీ చేస్తాం
ఈ సీజన్లో సాగు చేసిన ప్రతి ఎకరాకు యూరియాను అందిస్తామని జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు 186.590 మెట్రిక్ టన్నుల యూరియాను 1,281 మంది రైతులకు పంపిణీ చేశామన్నారు. ఇంకా 486 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు.
మార్టూరులో ఆకస్మిక పర్యటన
మార్టూరు: బాపట్ల జిల్లా కలెక్టర్ బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మార్టూరులో ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఎంపికై న ఉపాధ్యాయ అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీ అమరావతిలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రాంతాల చెందిన 500 మంది ఒకరోజు ముందుగానే రానుండగా.. మార్టూరులో బస చేయడానికి ఏర్పాటు చేశారు. మార్టూరులోని వివేకానంద, రాయల్ స్కూలు, హర్షిణి కళాశాలలో ఏర్పాటు చేస్తున్న వసతులను ఆయన పరిశీలించారు. వెంట ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ టి.ప్రశాంతి తదితరులున్నారు.